వివాదం లేని ‘అయోధ్య’ భూమిని తిరిగిచ్చేస్తాం

Central Government Filed Petition In Supreme COurt On Ayodhya - Sakshi

సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్‌

అయోధ్యలో రామాలయ నిర్మాణ దిశలో ముందడుగు

లోక్‌సభ ఎన్నికల ముంగిట మరో కీలక చర్య

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రభుత్వం గతంలో వివాదంలో చిక్కిన భూమి కాకుండా అదనంగా సేకరించిన, ఏ వివాదాలూ లేని 67.39 ఎకరాల భూమిని తిరిగి వాస్తవ యజమానులకు అప్పగించేందుకు అనుమతివ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ భూమిలో 42 ఎకరాలు రామాలయ నిర్మాణం కోసం పోరాడుతున్న రామ జన్మభూమి న్యాస్‌ అనే హిందూ సంస్థకు చెందినవే. ఆ భూమి తిరిగి రామ జన్మభూమి న్యాస్‌కు దక్కిన వెంటనే ఆ స్థలంలో రామాలయం నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నారనీ, అందుకే భూమిని యజమానులకు ఇచ్చేయాల్సిందిగా కేంద్రం కోర్టులో పిటిషన్‌ వేసిందని వార్తలు వస్తున్నాయి.

వివాదాస్పద స్థలం చుట్టూ ఉన్న మొత్తం 67.39 ఎకరాల్లోనూ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకుండా సుప్రీంకోర్టు 2003లో స్టే విధించింది. వివాదం పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఈ స్టే అమలులో ఉంటుందని నాడు కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవరించాలనీ, వివాదాలు లేని భూమిని అసలైన యజమానులకు తిరిగి అప్పగించేందుకు అనుమతించాలని తాజాగా కేంద్రం తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరింది. నాడు మసీదు ఉన్న 0.313 ఎకరా స్థలం మాత్రమే వివాదంలో ఉందనీ, ఆ మసీదు 2.77 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఆవరణలో ఉండేదని పిటిషన్‌లో కేంద్రం పేర్కొంది.

1993లోనే భూ సేకరణ.. 
1992లో కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చేయడం, ఆ తర్వాత చెలరేగిన మతకలహాల్లో 2 వేల మందికిపైగా చనిపోవడం తెలిసిందే. ఈ మసీదు 0.313 ఎకరా విస్తీర్ణంలో ఉండేది. మసీదును కూలగొట్టిన అనంతరం, ఆ మసీదు ఆవరణం విస్తరించిన 2.77 ఎకరాలు సహా చుట్టుపక్కల మొత్తం 67.703 ఎకరాల భూమిని 1993లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తెచ్చి సేకరించింది. ఈ మొత్తం స్థలంలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకుండా, యథాతథ స్థితిని కొనసాగించాలంటూ 2003లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తర్వాత 2010లో మసీదు ఆవరణంగా ఉన్న 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్‌ లల్లా మధ్య మూడు సమ భాగాలుగా పంచుతూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ వచ్చిన 14 పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు సిద్ధమవుతోంది. ఆలోపే కేంద్రం తాజా పిటిషన్‌ వేసింది. 1993లో కేంద్రం అధికంగా సేకరించిన భూమిని అసలైన యజమానులకు అప్పగించాలంటూ తమకు విజ్ఞప్తులు వస్తున్నాయనీ, భూములను తిరిగి ఇచ్చేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. వివాదం ఉన్న భూమిని తాము ముట్టుకోవడం లేదనీ, నాడు మసీదు ఉన్న 0.313 ఎకరా భూమిపై మాత్రమే వివాదం ఉందని తెలిపింది.  

వాళ్లు ఆలయం నిర్మించాలనుకుంటున్నారు: జవడేకర్‌ 
కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంపై మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ మాట్లాడుతూ ‘1993లో అధికంగా సేకరించిన భూమిని అసలైన యజమానులకు తిరిగి అప్పగించే కీలకమైన నిర్ణయానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఆ 67 ఎకరాల భూమిలో 42 ఎకరాలు రామ జన్మభూమి న్యాస్‌కు చెందినవే. ప్రభుత్వం భూములు యజమానులకు తిరిగి ఇచ్చేయాలనుకుంటోంది. వారు ఆ స్థలంలో రామాలయం నిర్మించాలనుకుంటున్నారు’అని తెలిపారు. న్యాయ మార్గంలోనే గుడిని నిర్మించాలని బీజేపీ ఎప్పుడూ చెబుతుందనీ, అందులో భాగంగానే ఇప్పుడు కోర్టులో పిటిషన్‌ వేశామని ఆయన చెప్పారు. భూమిని తిరిగి యజమానులకు అప్పగించేందుకు కోర్టు నుంచి వీలైనంత తొందర్లోనే అనుమతి వస్తుందని జవడేకర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

కేంద్రం చర్యపై మిశ్రమ స్పందనలు
కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడంపై పలు సంస్థలు, పార్టీలు, వ్యక్తుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కేంద్రం సరైన దిశలోనే అడుగు వేసిందని విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) పేర్కొంది. ‘రామాలయ నిర్మాణం కోసమే రామ జన్మభూమి న్యాస్‌ నాడు 42 ఎకరాల స్థలాన్ని సేకరించింది. ఈ భూమిపై వివాదమేదీ లేదు. సరైన దిశగా కేంద్రం వేసిన ఈ అడుగును వీహెచ్‌పీ స్వాగతిస్తోంది’అని ఆ సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కేంద్రం చర్యను ప్రశంసించారు. 16 ఏళ్లుగా ఉన్న స్టేను ఎత్తేయాలని ఇప్పుడు కోరడం వెనుక ఆంతర్యమేంటని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ఎన్నికల కోసమే ఈ చర్య అని విమర్శించింది. ఎన్నికల వేళ సంఘ్‌ పరివార్‌ను మెప్పు పొందడం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని సీపీఎం ఆరోపించింది. బాబ్రీ మసీదు కేసు విచారణ పారదర్శకంగా జరగకుండా చూసేందుకు కేంద్రం తాను చేయగలిగినదంతా చేస్తోందనీ, ఈ కేసు కూడా కేంద్రం కుట్రతో వేసిందేనని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపణలు చేశారు.  

 
అయోధ్యలో ‘వివాదాస్పదం కాని’ భూమి ఏది?  
అయోధ్యలో కూల్చివేతకు గురైన బాబ్రీ మసీదు సమీపంలో కేంద్ర ప్రభుత్వం 1993లో సేకరించిన 67 ఎకరాల్లో ‘వివాదాస్పదం కాని’భూమి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఈ స్థలంలో రాముడి గుడి కడతారన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈ భూమిలో 0.313 ఎకరాలే వివాదాస్పద స్థలంగా పేర్కొంది. బాబ్రీ మసీదు గుమ్మటం ఉన్న 0.313 ఎకరాలు సహా 2.77 ఎకరాల భూమికి నిజమైన యజమాని ఎవరనే విషయంపైనే దశాబ్దాల నుంచి కోర్టుల్లో వివాదం నడుస్తోంది. 1993 ఆయోధ్య లాండ్‌ ఆక్విజిషన్‌ చట్టం ద్వారా అప్పటి కేంద్ర సర్కారు 67.703 ఎకరాలను సేకరించింది.

ఇందులో కేవలం 0.313 ఎకరాలే వివాదాస్పదమైన స్థలమని, ‘మిగిలిన’, ‘అదనపు’భూమిని దాని న్యాయమైన యజమానులకు బదిలీచేయడానికి అనుమతించా లని కేంద్రం కోర్టును అభ్యర్థించింది. అయో ధ్యలో రామ మందిర నిర్మాణానికిగాను ‘శిలా పూజ’చేయడానికి 2003లో సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. వివాదాస్పద స్థలం సహా సేకరించిన 67 ఎకరాల్లో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. అయోధ్య కేసుకు సంబందించిన సివిల్‌ కేసులపై 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమి సున్నీ వక్ఫ్‌ బోర్డుదా? అఖిల భారత హిందూ మహాసభదా లేక రామ్‌ లల్లా(రాముడు)దా అనే వివాదంపై.. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని మూడు పక్షాల మధ్య సమానంగా పంపకం చేసింది.అలాగే,  బాబ్రీ మసీదు మధ్య గుమ్మటం కింద ఉన్న భూమి హిందువులదని ప్రకటించింది. అయి తే, ఈ తీర్పును సున్నీ వక్ఫ్‌ బోర్డు, రామజన్మభూమి న్యాస్‌ సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాయి.
 
ఇస్మాయిల్‌ ఫారూఖీ తీర్పులో ఏం చెప్పిందంటే.. 
కేంద్రం 67కు పైగా ఎకరాల భూమిని సేకరించడాన్ని సవాలు చేస్తూ డాక్టర్‌ ఇస్మాయిల్‌ ఫారూఖీ వేసిన పిటిషన్‌పై ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం 1994లో తీర్పు ఇచ్చింది. అయోధ్య సివిల్‌ దావాలపై అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత– వివాదాస్పదం కాని భూమిని దాని యజమానులకు అప్పగించే విషయం సర్కారు పరిశీలించవచ్చని ఈ ధర్మాసనం తన తీర్పులో సూచించింది. ఈ విషయాన్ని కేంద్రం తన పిటిషన్‌లో సుప్రీంకోర్టుకు గుర్తు చేసింది. రామ మందిరం నిర్మాణం చేపట్టి, ఈ కార్య క్రమం పర్యవేక్షించడానికి ఏర్పాటైన రామ జన్మభూమి న్యాస్‌కు వివాదాస్పదం కాని భూమిని ఇవ్వాలనుకుంటున్నట్టు కేంద్రం తన తాజా పిటిషన్‌లో కోర్టుకు తెలిపింది. – సాక్షి, నాలెడ్జ్‌ సెంటర్‌

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top