దీదీ ఆయన బాటలో నడిస్తే..
కోల్కతా : రాజకీయ కక్ష సాధింపుతోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ కార్యకర్తలను హతమారుస్తున్నారని బీజేపీ ఆరోపించింది. విభజిత రాజకీయాలను దీదీ అనుసరిస్తున్నారని కాషాయ పార్టీ మండిపడింది. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీకి ఆమె నివాళులు అర్పించడాన్ని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్వర్గీయ ప్రస్తావిస్తూ ముఖర్జీ ఆలోచనాధోరణిని మమతా బెనర్జీ అనుసరిస్తే బెంగాల్లో హింసకు తెరపడుతుందని అన్నారు.
శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశాన్ని ఏకతాటిపైకి నడిపేందుకు ప్రయత్నిస్తే మమతా బెనర్జీ దేశాన్ని విభజించే రాజకీయాలకు పాల్పడతారని ఆరోపించారు. ముఖర్జీ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. జన్ సంఘ్ వ్యవస్ధాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కోల్కతాలా జన్మించారు. 1951 నుంచి 1952 వరకూ ఆయన వాణిజ్య పరిశ్రమల మంత్రిగా వ్యవహరించారు.