బీజేపీ మూడో జాబితా
కాంగ్రెస్పై ‘పాస్’ అసంతృప్తి
అహ్మదాబాద్: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసింది. 28 మందికి టికెట్లు కేటాయించిన ఈ జాబితాలో మాజీ మంత్రి సౌరభ్ పటేల్, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్సీ ఫాల్దూ పేర్లు కూడా ఉన్నాయి. ముగ్గురు మంత్రులు సహా ఆయా స్థానాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న 16 మందికి ఈ జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం. ఫాల్దూ జామ్నగర్–దక్షిణ నియోజకవర్గం నుంచి, సౌరభ్ పటేల్ బోటాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
బీజేపీ తాజా జాబితాతో అభ్యర్థుల సంఖ్య 134కు చేరింది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వెంటరాగా, ప్రస్తుత సీఎం విజయ్ రూపానీ రాజ్కోట్ (పశ్చిమ) స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అటు కాంగ్రెస్ ప్రకటించిన 77 మంది అభ్యర్థుల జాబితాలో పాస్ (పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి) నాయకులకు కేవలం రెండే టికెట్లు లభించడంతో వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పటేళ్ల నేత హార్దిక్ పటేల్ రాజ్కోట్లో సోమవారం ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్కు బహిరంగ మద్దతు పలకాల్సి ఉండగా ర్యాలీని అనూహ్యంగా రద్దు చేసుకున్నారు.