బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ సింగర్!
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీజేపీ అధిష్టానం ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ప్రముఖ సింగర్ హన్స్ రాజ్ హన్స్ అనూహ్యంగా చోటు దక్కించుకున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని బెదిరించిన ఉదిత్ రాజ్ను పక్కన పెట్టి మరీ నార్త్ వెస్ట్ ఢిల్లీకి హన్స్ రాజ్ను ఎంపిక చేశారు. పంజాబీ ఫోక్, సూఫీ సింగర్గా ప్రసిద్ధి గాంచిన హన్స్ రాజ్ 2009లో అకాలీదళ్ తరఫున తన సొంత నియోజకవర్గం జలంధర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్లో చేరిన హన్స్ రాజ్ ప్రస్తుతం బీజేపీ తరఫున ఢిల్లీలో పోటీ చేస్తుండటం విశేషం.
కాగా వచ్చే నెల 12న జరుగనున్న ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో భాగంగా హన్స్ రాజ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవుడి నిర్ణయం మీదే తన గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఆప్ అభ్యర్థి గుగాన్ సింగ్, కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ లిలోథియాను ఎదుర్కోనున్నారు. ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో క్లీన్స్వీప్ చేసిన బీజేపీ ఏడు ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
బీజేపీ ఢిల్లీ అభ్యర్థులు
గౌతం గంభీర్- ఈస్ట్ ఢిల్లీ
మీనాక్షి లేఖి- న్యూఢిల్లీ
హర్షవర్ధన్- చాందినీ చౌక్
మనోజ్ తివారి- నార్త్ ఈస్ట్ ఢిల్లీ
పర్వేష్ వర్మ- వెస్ట్ ఢిల్లీ
రమేష్ బిధూరి- సౌత్ ఢిల్లీ
హన్స్రాజ్ హన్స్- నార్త్ వెస్ట్ ఢిల్లీ