ఆయన విఫల వారసుడు..
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఓ విఫల వారసుడని బీజేపీ అభివర్ణించింది. ఇటీవల పలు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని ప్రస్తావిస్తూ రాహుల్పై బీజేపీ విమర్శలు గుప్పించింది. మోదీ నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై విఫల వారసుడైన రాహుల్ మార్కులు కేటాయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. 2013లో రాహుల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఇటీవల పార్టీ పగ్గాలు చేపట్టిన అనంతరం ఎదురైన ఓటములను ఈ సందర్భంగా బీజేపీ ట్వీట్లో ప్రస్తావించింది.
రాహుల్ కాంగ్రెస్ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 24 ఎన్నికల్లో ఆ పార్టీకి భంగపాటు ఎదురైందని పేర్కొంది. కేంద్రంలో మోదీ సర్కార్ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రిపోర్ట్ కార్డ్ను ప్రకటించిన రాహుల్ వ్యవసాయం, విదేశాంగ విధానం, ఇంధన ధరలు, ఉపాధి కల్పన రంగాల్లో సర్కార్కు ఎఫ్ గ్రేడ్ ప్రకటించారు. నినాదాలు ఇవ్వడం, సొంత డబ్బా కొట్టుకోవడంలో మాత్రం ఏ ప్లస్ గ్రేడ్ను ఇచ్చిన సంగతి తెలిసిందే.