30లోగా బ్యాంకుల్లో ఆధార్ కేంద్రాలు
సాక్షి, బెంగుళూరు: ఈనెల 30లోగా అన్ని బ్యాంకులు ఆధార్ నమోదు కేంద్రాలు, అప్డేట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కోరింది. ప్రతి బ్యాంకు తమ పది బ్రాంచ్లకు ఒక ఆధార్ సెంటర్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. డెడ్లైన్ ముంచుకొస్తుండటంతో బ్యాంకులు ఈ కేంద్రాల ఏర్పాటుపై సన్నాహాలు ముమ్మరం చేశాయి. గడువులోగా ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయని బ్యాంకులకు ఒక్కో సెంటర్కు నెలకు రూ 20,000 చొప్పున పెనాల్టీ విధిస్తామని యూఐడీఏఐ బ్యాంకులకు స్పష్టం చేసింది. అయితే బ్యాంకులు మాత్రం తాము బయోమెట్రిక్ పరికరాలను కొనుగోలు చేస్తున్నామని, అధీకృత ఏజెన్సీలను గుర్తించే పనిలో ఉన్నామని సెప్టెంబర్ 30 డెడ్లైన్ను పొడిగించాలని కోరుతున్నాయి.
మరోవైపు బ్యాంకు ఖాతాదారులందరూ తమ ఖాతాలకు డిసెంబర్ 31లోగా ఆధార్ అనుసంధానం చేయాల్సి రావడంతో ఆధార్ సేవా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఇక పాన్ కార్డు, ఆధార్ లింక్ డెడ్లైన్ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు డిసెంబర్ 31గా నిర్ధారించింది. కాగా, దేశవ్యాప్తంగా తాము 1040 ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేశామని కెనరా బ్యాంక్ తెలిపింది.
సంబంధిత వార్తలు