‘రాహుల్ ఒక్కడే అందుకు అర్హుడు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ గాందీ ఒక్కరే పార్టీని సమర్దంగా ముందుకు నడిపించగలరని సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లోత్ అన్నారు. పార్టీ చీఫ్గా వైదొలగిన అనంతరం రాహుల్ తొలిసారిగా సోమవారం పార్టీ సీఎంలతో భేటీకి ముందు గెహ్లోత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్లో రాహుల్ పాత్రపై ఉత్కంఠతో పాటు పార్టీ చీఫ్గా రాహుల్ కొనసాగాలని నేతల రాజీనామాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ నాయకత్వం పట్ల సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్ సీఎంలు ఆయనతో సమావేశమవుతారని రాజస్ధాన్ సీఎం గెహ్లోత్ చెప్పుకొచ్చారు.
దేశ అభివృద్ధి, పౌరుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కలిగిన రాహుల్ గాంధీ ఒక్కరే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని నడిపించగలరని గెహ్లోత్ తన విధేయత చాటుకున్నారు. మోదీ సర్కార్ వైఫల్యాలతో పాటు ఆర్థిక వ్యవస్థ కుదేలైనా తాము సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.