‘నన్ను చంపేందుకు కుట్ర పన్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : తనను చంపేందుకు శక్తివంతమైన వ్యక్తులు కుట్ర చేస్తున్నారంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్పై అనిల్ కుమార్ శర్మ అనే వ్యక్తి మంగళవారం కారంపొడితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన కేజ్రీవాల్ మాట్లాడుతూ.... ‘గత రెండేళ్లలో నాపై నాలుగుసార్లు దాడులు జరిగాయి. ఇదేమంత చిన్న విషయం కాదు. దాడి చేసిన వ్యక్తుల వెనుక ఎవరో శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారు. నన్ను చంపాలనేది వారి ఉద్దేశం’ అని వ్యాఖ్యానించారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేశాను కాబట్టి ఇలాంటి దాడులకు భయపడేది లేదని పేర్కొన్నారు. తానే కాదు ఆప్ కార్యకర్తలు కూడా కేవలం పార్టీ కోసమే కాకుండా దేశ ప్రజల బాగోగుల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతారని వ్యాఖ్యానించారు.
కాగా అత్యంత భద్రత ఉండే సచివాలయంలోని సీఎం కార్యాలయం బయటే కేజ్రీవాల్పై అనిల్ కుమార్ శర్మ దాడి చేసిన తెలిసిందే. ఫేస్బుక్ ప్రొఫైల్లో తాను బీజేపీ కార్యకర్తనని అనిల్ పేర్కొనడంతో.. కేజ్రీవాల్ను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.