జైట్లీ పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఈ నెల 9 నుంచి ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతుండగా, శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వైద్యశాలకు వెళ్లి జైట్లీని పరామర్శించారు. మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్లు కూడా ఆసుపత్రికి వచ్చి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. శ్వాసతీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ఆయన ఆగస్టు 9న ఉదయం ఎయిమ్స్లో చేరారు. ఆ రోజు రాత్రి నుంచి ఆయనను వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచారు. జైట్లీ ఆరోగ్యం నిలకడగానే ఉందని అదే రోజు రాత్రే ఎయిమ్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాతి నుంచి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు.
సంబంధిత వార్తలు