పోలవరం పూర్తయితే పంపింగ్‌ ఆపేస్తాం

AP during the Brijesh Tribunal inquiry - Sakshi

బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ విచారణ సందర్భంగా ఏపీ

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పట్టిసీమలో పంపింగ్‌ నిలిపేస్తామని ఆంధ్రప్రదేశ్‌ తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి గురువారం జస్టిస్‌ బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు విచారణ జరిగింది. జలాల పంపిణీకి సంబంధించి ఏపీ తన అవసరాలకు అనుగుణంగా దాఖలు చేసిన అఫిడవిట్‌పై తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ క్రాస్‌ ఎగ్జామిన్‌ చేశారు.

ఈ సందర్భంగా ఏపీ తరఫు సాక్షి సాగునీటి రంగ నిపుణులు కె.వి.సుబ్బారావుకు పలు ప్రశ్నలు సంధించారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నుంచి కృష్ణా డెల్టాకు శాశ్వత ప్రాతిపదికన సాగునీరు ఇవ్వచ్చుకదా అని ప్రశ్నిచారు. దీనికి సుబ్బారావు స్పందిస్తూ.. గోదావరి జలాలను వినియోగించుకోవడానికి ఏపీ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును తాత్కాలికంగా చేపట్టినట్టు సమాధానమిచ్చారు.

ఈ ప్రాజెక్టు పోలవరంలో భాగం కాదని గతంలో లోక్‌సభలో కేంద్ర మంత్రి చెప్పారు కదా..అని వైద్యనాథన్‌ ప్రశ్నించగా.. పోలవరం ప్రాజెక్టులో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చే ప్రధాన హెడ్‌ వర్క్‌ పనులు పూర్తయిన తర్వాత పట్టిసీమ ప్రాజెక్టులో బిగించిన 30 వర్టికల్‌ టర్బైన్‌ పంపులను తొలగిస్తామని స్పష్టం చేస్తూ 2015 సెప్టెంబర్‌ 15న కేంద్ర మంత్రికి ఏపీ ముఖ్యమంత్రి లేఖ రాశారని వివరించారు. పట్టిసీమ కేవలం తాత్కాలిక ప్రాజెక్టేనని చెప్పారు. పోలవరం పూర్తికాగానే నీటి ఎత్తిపోతలను ఆపేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. విచారణ శుక్రవారం కూడా కొనసాగనుంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top