కశ్మీర్ ఉద్రిక్తత: ఎయిర్ ఇండియా ఛార్జీల తగ్గింపు
శ్రీనగర్ ఢిల్లీ మార్గాల్లో తగ్గింపు
ఆగస్ట్ 15 వరకు కొనసాగింపు
కశ్మీర్: జమ్మూకశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన విమాన ఛార్జీలను తగ్గించింది. పాకిస్తాన్లోని ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమర్నాథ్ యాత్రను నిలపివేస్తున్నట్లు ప్రకటించింది. పర్యటకులను, యాత్రికులను ఉన్నపలంగా వెనక్కి తిరిగి రావాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఎయిర్ ఇండియాలో ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీనగర్ నుంచి ఢిల్లీ వెళ్లే మార్గంలో విమాన రేట్లు తగ్గిస్తున్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిథి ధనుంజయ కుమార్ ఆదివారం ప్రకటించారు.
శ్రీనగర్ నుంచి ఢిల్లీకి సాధారణ ఛార్జ్ 9500 కాగా, ప్రస్తుత తగ్గింపుతో రూ.6715గా, అలాగే ఢిల్లీ నుంచి శ్రీనగర్కు రూ.6,899 కానుంది. ఈ తగ్గింపు ఆగస్ట్ 15 వరకు ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఎయిర్ ఇండియ అథారిటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 6,200 మంది ప్రయాణికులు శ్రీనగర్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు తమ వద్ద నమోదు చేసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విమాన సంస్థలు ప్రత్యేక సర్వీసులను కూడా నడుపుతున్నాయి. విమాన ఛార్జీల తగ్గింపుపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతోషం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియాకు కృతజ్ఞతలు తెలిపారు.
సంబంధిత వార్తలు