ఆకట్టుకుంటున్న మోదీ మ్యాంగో
లక్నో : మోదీ శారీస్, మోదీ జాకెట్స్ తర్వాత ఇప్పుడు మోదీ మ్యాంగోలు ప్రజలకి తీపిపంచేందుకు ముందుకొచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ను క్యాష్ చేసుకునేందుకు వ్యాపారులు వినూత్న పోకడలను అనుసరిస్తున్నారు. లక్నోలో జరుగుతున్న మ్యాంగో ఫెస్టివల్కు వ్యాపారులు రాజకీయ రంగులద్దారు.
దాదాపు 700కు పైగా ప్రముఖ మ్యాంగో వెరైటీలను అందుబాటులోకి తెచ్చిన వ్యాపారులు ఈ ఫెస్టివల్లో 450 గ్రాముల బరువుండే మోదీ మ్యాంగోతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని తనకు మామిడి పండ్లు అంటే ఇష్టమని చెప్పడంతో పలువురు మామిడి రైతులు తమ దిగుబడులకు మోదీ పేరు పెట్టుకుని వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.
మోదీజీ తరహాలోనే మోదీ మ్యాంగో కూడా విశేష ఆదరణను సొంతం చేసుకుందని, ప్రధాని మోదీ 56 అంగుళాల ఛాతీలాగానే ఈ మ్యాంగో సైజ్ కూడా ప్రత్యేకమని, అందుకే ఈ మామిడికి మోదీ మ్యాంగో అని పేరుపెట్టామని మ్యాంగో కమిటీ ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర కుమార్ సింగ్ చెప్పుకొచ్చారు. మోదీ మ్యాంగోను తాము పేటెంట్ కూడా తీసుకున్నామని సింగ్ తెలిపారు.