వైరల్‌గా సిద్ధార్థ్ కేరళ డొనేషన్‌ చాలెంజ్‌

Actor Siddharth KeralaDonationChallenge viral - Sakshi

కీకీలాంటి పనికిరాని చాలెంజ్‌లే కాదు కేరళ డొనేషన్‌ వంటి మంచి చాలెంజ్‌లను స్వీకరిస్తామంటూ నెటిజన్లు నిరూపిస్తున్నారు. హీరో సిద్దార్థ ప్రారంభించిన కేరళ డొనేషన్‌ చాలెంజ్(#KeralaDonationChallenge) తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. దేవభూమిగా, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరొందిన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. గత శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని వరద పరిస్థితి కేరళను అతలాకుతలం చేస్తోంది. గత పదిరోజుల్లో దాదాపు100 డ్యాములు, రిజర్వాయర్లు, నదులు మునిగిపోయాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. ఆగస్టు 26వరకు  కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. సహాయక శిబిరాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికి 324 మంది మృతి చెందగా 3లక్షలమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

వరదలకు అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేరళ డొనేషన్‌ చాలెంజ్‌ని హీరో సిద్దార్థ్‌  ప్రారంభించారు. తన వంతు సాయంగా రూ.10 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపించారు. దానికి సంబంధించిన లావాదేవీ రసీదును ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి, మీరు కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించండంటూ సవాలు విసిరారు. కేరళ డొనేషన్‌ చాలెంజ్‌ను స్వీకరిస్తూ సామాన్యులు కూడా పెద్దమొత్తంలో  కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందిస్తున్నారు. ‘మీ టూ’  చాలెంజెతో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను, ఐస్‌ బకెట్‌ చాలెంజ్‌తో జబ్బుల మీద (మోటర్‌ న్యూరోస్‌ డిసీజ్‌) అవగాహన, రైస్‌ బకెట్‌తో సామాజిక బాధ్యతవంటి అంశాలను వైరల్‌ చేసిన నెటిజన్లు కేరళలో వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు.

చాలెంజ్‌ స్వీకరించి నెటిజన్లు పంపింన కొన్ని రసీదులు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top