‘ఆప్ ఎమ్మెల్యేల అనర్హత’పై నేడు విచారణ
ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తమపై అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, జస్టిస్ ఏకే చావ్లా బెంచ్ ముందుకొచ్చిన ఈ పిటిషన్ను బుధవారం విచారణకు చేపడతారు.
ఢిల్లీ అసెంబ్లీలోని 20 మంది సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల సంఘం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని ఒక ఎమ్మెల్యే తరఫున హాజరైన న్యాయవాది మనీశ్ వశిష్ట్ కోరారు. తమను రాష్ట్రపతి అనర్హులుగా ప్రకటించారంటూ ప్రభుత్వం వెలువరించిన ప్రకటనను రద్దుచేయాలని ఆ పిటిషన్లో ఎమ్మెల్యేలు కోరారు.