‘సోషల్‌ ట్రేడ్‌’ కేసులో 519 కోట్ల అటాచ్‌

‘సోషల్‌ ట్రేడ్‌’ కేసులో 519 కోట్ల అటాచ్‌ - Sakshi


మరిన్ని ఆస్తులపై ఈడీ దృష్టి

లక్నో: దాదాపు రూ. 3,700 కోట్ల విలువైన ‘సోషల్‌ ట్రేడ్‌’ కుంభకోణంలో రూ. 519.59 కోట్లను ఎన్ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) స్తంభింపచేసింది. 12 బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదును గుర్తించిన ఈడీ వాటిని అటాచ్‌ చేస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చింది. తమ వెబ్‌సైట్‌లో క్లిక్‌ చేస్తే వేలు సంపాదించుకోవచ్చంటూ నమ్మించి నోయిడాకు చెందిన అబ్లేజ్‌ ఇన్ఫో సోల్యూషన్స్   లక్షలాది మందిని మోసగించింది. ఈ కేసు విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 9 నెలల వ్యవధిలో 19 లక్షల లావాదేవీల ద్వారా ఆ కంపెనీ రూ.800 కోట్లకు పైగా సేకరించింది.


ప్రధాన నిందితుడు అనుభవ్‌ మిట్టల్‌ గతేడాది నోయిడాలో రూ. 3.6 కోట్ల విలువైన విల్లాను కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. మనీ ల్యాండరింగ్‌ నిరోధక చట్టం కింద త్వరలో మరిన్ని స్థిర, చరాస్తుల్ని అటాచ్‌ చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది. యూపీ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సమాచారం మేరకు... జనవరి 5న అబ్లేజ్‌ ఇన్ఫో సొల్యూషన్స్  చేస్తున్న ‘సోషల్‌ ట్రేడ్‌’ మోసాలపై ఈడీ క్రిమినల్‌ కేసు నమోదు చేసింది. దీంతో పోంజి తరహ స్కాం(మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ స్కాం) బట్టబయలైంది.  కాగా, మనీ ల్యాండరింగ్‌ కేసులో వ్యాపారవేత్త పరాస్‌ మల్‌ లోధా, న్యాయవాది రోహిత్‌ టాండన్ , ఇతరులకు చెందిన రూ. 6.84 కోట్లను శుక్రవారం ఈడీ అటాచ్‌ చేసింది. నోట్ల రద్దు తర్వాత అక్రమంగా పాత నోట్లు మార్చడంతో కేసులు నమోదుచేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top