రెండేళ్ల నుంచి దర్జాగా సెలవులు
ఒడిశా: సాధారణంగా ఎలాంటి ఉద్యోగమైనా పై అధికారులకు చెప్పకుండా సెలవులు పెట్టడం సాధ్యం కాదు. ఒకవేళ అనుకోని పరిస్థితులతో అలా పెట్టాల్సి వస్తే సెలవు పెట్టాకనైనా కారణాలు వివరిస్తారు. అలా వివరించకుంటే ప్రైవేటు ఉద్యోగమైతే ఊడుతుంది. బాస్ చేతిలో తిట్లు సరాసరి. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగం అయితే క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటారు. కానీ, ఒడిశాలో కొంతమంది ప్రభుత్వ వైద్యులు దర్జాగా సెలవులు పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వారు విధుల్లో చేరిన రెండేళ్ల నుంచి.
ఈ సెలవులకోసం పై అధికారుల నుంచి అనుమతికాదుకదా కనీసం సమాచారం కూడా అందించలేదు. అలా రెండేళ్ల నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 120మంది వైద్యులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తమ విధులకు దూరంగా ఉన్నారు. దీంతో ఆ వైద్యులపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదిహేను రోజుల్లోగా విధుల్లో చేరకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవంటూ బహిరంగ నోటిసులు ఇచ్చింది. గత ఏడాది కూడా ఒడిశా ప్రభుత్వం 408మంది వైద్యులను విధుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే.