అవే మాకు వంద మార్కులు
బండి సరోజ్కుమార్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘సూర్యాస్తమయం’. హిమాన్సీ కాట్రగడ్డ, త్రిశూల్ రుద్ర కీలక పాత్రలు చేశారు. రఘు పిల్లుట్ల, రవికుమార్ సుదర్శి నిర్మించారు. ఈ సినిమాకు కేవలం హీరో, దర్శకత్వం మాత్రమే కాకుండా స్టోరీ రైటర్, స్క్రీన్ప్లే రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, స్టంట్ మాస్టర్.. ఇలా 11 శాఖల్లో సరోజ్ కుమార్ వర్క్ చేయడం విశేషం. ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేసిన నిర్మాత డి. సురేశ్బాబు మాట్లాడుతూ – ‘‘పదేళ్ల క్రితం సరోజ్కుమార్ నాకో కథ చెప్పారు. కొన్ని మార్పులు సూచించాను. కామ్గా వెళ్లి పోయి ఆ కథతో తమిళంలో సినిమా చేసి ప్రశంసలు దక్కించుకున్నారు.
ఇప్పుడు తను ‘సూర్యాస్తమయం’ సినిమా చూడమంటే చూశాను. బాగా డైరెక్ట్ చేశారు’’ అన్నారు. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సినిమా అంటే కళ మాత్రమే కాదు బాధ్యత కూడా అని సురేశ్బాబుగారు చెప్పారు. ఈ సినిమాను చూసిన ఏకైక వ్యక్తి ఆయనే. మాకు పాస్మార్కులు వేశారు. అవే మాకు వంద మార్కులుగా అనుకుంటున్నాం. రెండు దశాబ్దాల పాటు గుర్తుండిపోయే సినిమా ఇది. కథకు, చెగువేరాకు సంబంధం ఏంటి? అనేది సినిమాలో తెలుస్తుంది’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు మా తొలి ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాతలు. హిమాన్సీ కాట్రగడ్డ, త్రిశూల్రుద్ర మాట్లాడారు.