అలా చేశాకే అవకాశమిచ్చారు!

Shraddha Srinath Reveals About Her Auditions - Sakshi

సినిమా: అలా చేసిన తరువాతనే అవకాశం ఇచ్చారు అని చెప్పింది నటి శ్రద్ధాశ్రీనాథ్‌. శాండిల్‌వుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌ అంటూ చుట్టేస్తున్న ఈ కన్నడ భామ ఈ మూడు భాషల్లోనూ సక్సెస్‌లు అందుకుంది. నిజం చెప్పాలంటే ఈ బ్యూటీ నటజీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం యూటర్న్‌ కన్నడ చిత్రం. ఇక తమిళంలో విక్రమ్‌వేదా, తెలుగులో జెర్సీ చిత్రాలు మంచి విజయాలతో ప్రాచుర్యం పొందేలా చేశాయి. నటిగా ఇంత సక్సెస్‌ రేటింగ్‌ ఉన్నా ఆడిషన్స్‌ తప్పడం లేదట. అలా ఒక్క అవకాశం రావాలంటే ఎంత కష్టపడాల్లో నటి శ్రద్ధాశ్రీనా«థ్‌ను చూస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతం అజిత్‌ కథానాయకుడిగా నటించిన నేర్కొండ పార్వై చిత్రంలో ప్రధాన పాత్రను పోషించింది. దీనికి హెచ్‌.వినోద్‌ దర్శకుడు. దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్‌ నిర్మించిన తొలి తమిళ చిత్రం నేర్కొండపార్వై. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 8న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

ఈ సందర్బంగా ఇందులో నటించిన అనుభవాన్ని నటి శ్రద్ధాశ్రీనాథ్‌ తెలుపుతూ అసలు ఈ చిత్రంలో నటించే అవకాశం వస్తుందా?రాదా? అన్న సందేహం తనకు కలిగిందని చెప్పింది. అందుకు కారణం నేర్కొండ పార్వై చిత్రంలో నటించడానికి తనను ఫోన్‌ చేసి పిలిపించారని చెప్పింది. అందుకోసం ఆడిషన్‌ నిర్వహించినట్లు తెలిపింది. అయితే ఆడిషన్‌ ముగిసిన తరువాత చాలా రోజుల వరకూ ఆ చిత్ర వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేదని అంది. అలాంటి పరిస్థితుల్లో మరో మూడు వారాల తరువాత పిలిచారని చెప్పింది. అప్పుడు తనతో మళ్లీ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలిపింది. అప్పుడు దర్శకుడు వినోద్‌ తన వద్దకు వచ్చి  అభిమానులు మీమ్మల్ని అసహ్యంచుకునేంతగా నటించమని చెప్పారని అంది. దీంతో తనలోని ప్రతిభనంతా చూపుతూ ఆయన చెప్పినట్లు నటించానని, ఆ తరువాతనే నేర్కొండ పార్వై చిత్రంలో నటించడానికి అవకాశం ఇచ్చారని తెలిపింది. ఈ చిత్రంలో అజిత్‌తో కలిసి నటించడం తీయని అనుభవంగా పేర్కొంది. తనకు కథ నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తున్నట్లు చెప్పిన శ్రద్ధాశ్రీనాథ్‌ నటుడు విశాల్‌ సరసన ఒక చిత్రం, మాధవన్‌తో మారన్‌ అనే చిత్రంలోనూ నటించనున్నట్లు చెప్పింది. అలా తానిప్పుడు చాలా బిజీ తెలుసా. అని దీర్ఘాలు తీస్తూ చెప్పింది

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top