అలా చేస్తే.. మీ ప్రాణాలు ఎవరు కాపాడుతారు?
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా అందరు ఇళ్లకే పరిమితం కావాలని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి సోషల్ మీడియా వేదికగా ప్రజలను కోరారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాలని చెప్పిన సల్మాన్.. ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేశారు. ఇది గేమ్ షో కాదని.. ‘జిందగీ కా బిగ్బాస్’ అని చెప్పారు. ఎటువంటి అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నవారు.. వాళ్ల కుటుంబాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై తిరుగుతున్న కొందరిని పోలీసులు కొట్టడంపై సల్మాన్ స్పందిస్తూ.. ఇళ్లలోఉన్నవారిని పోలీసులు కొట్టడం లేదు కదా అని చెప్పారు. కరోనా పాజటివ్గా తేలిన వ్యక్తులు ఆస్పత్రుల నుంచి పారిపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారు చావడానికి వెళ్తున్నారా లేక బతకడానికి వెళ్తున్నారా అని ప్రశ్నించారు.
ఇతరుల కోసం డాక్టర్లు, నర్సులు తమ జీవితాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. అలాంటి వారిపై రాళ్లు విసరడం చేస్తే.. మీ ప్రాణాలను ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు. ఒకవేళ ప్రార్థన చేసుకోవాలని అనుకునేవారు ఇంట్లోనే ఉండి చేసుకోవాలన్నారు. మీరు బయటకు వచ్చి మీ కుటుంబ సభ్యుల జీవితాలను కూడా ఎందుకు ప్రమాదంలోకి నెడతారని ప్రశ్నించారు. అంతకు ముందు వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇంట్లోనే ప్రార్థనలు నిర్వహిస్తున్న ఓ ఫొటోను కూడా సల్మాన్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాస్క్ ధరించడం ఎంతో ముఖ్యమో చెప్పిన సల్మాన్.. తన స్నేహితుడికి ఎదురైన అనుభవాన్ని వివరించాడు. ‘నేను రెండు రోజులు సెలవు తీసుకుందామని.. ఫామ్హౌస్కు వచ్చాను. కానీ కరోనా వైరస్ ప్రతిఒక్కరు సెలవులు తీసుకునేలా చేసింది. లాక్డౌన్ విధించడంతో నా తల్లి, ఇద్దరు సోదరిలు, వారి పిల్లలు.. ఇలా మా కుటుంబం మొత్తం ఇక్కడే ఉండిపోయాం. ఫామ్హౌస్లో ఉన్నవారి కోసం రేషన్ తీసుకురావడానికి నా స్నేహితుడు ఒకరు బయటకు వెళ్లాడు. రోడ్డుపై నా స్నేహితుడిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే అతడు పోలీసులతో మాట్లాడానికి తన ఫేస్ మాస్క్ తొలగించాడు. కానీ విధుల్లో ఉన్న పోలీసులు మాస్క్ పెట్టుకోవాల్సిందిగా నా స్నేహితుడిని కోరారు. ఇంటికి వచ్చాక నేను కూడా మాస్క్ తీయడం మంచిది కాదని అతనికి చెప్పాను’ అని సల్మాన్ తెలిపారు. కాగా, ప్రస్తుతం సల్మాన్.. పాన్వెల్ ఫామ్హౌస్లో కుటుంబసభ్యులతో కలిసి ఉన్నారు.
మరిన్ని వార్తలు