ప్రధాని పిలుపు: సమైక్యతను చాటుదాం
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా రక్కసిని అంతమొందించేందుకు భారత్ అలుపెరగని పోరాటం చేస్తోంది. దీనికి మార్చి 22న విధించిన జనతా కర్ఫ్యూ నాంది పలకగా తర్వాతి రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్తో ఇది మరింత ఉధతమైంది. ఇక పలు దేశాల్లో మరణ మృదంగం మోగిస్తున్న ఈ మహమ్మారి వ్యాప్తిని నిలువరించేందుకు ప్రభుత్వాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. దీనికి తోడు వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ కార్మికులు ఇలా పలు రంగాల వారు విశేషంగా కృషి చేస్తున్నారు. తద్వారా మిగతా దేశాలతో పోలిస్తే భారత్లో కరోనా తీవ్రత తక్కువగా ఉంది. (ఇలా భయపడితే ఎలా...)
కరోనా పరిస్థితిపై శుక్రవారం నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఏప్రిల్ 5న రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాలపాటు లైట్లు ఆర్పివేసి, దీపాలు వెలిగించి భారత సంకల్పాన్ని చాటి చెప్పాలని భారత ప్రజలకు పిలుపునినిచ్చారు. ఈ నిర్ణయాన్ని వివాదాస్పద హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలీ చండేల్ స్వాగతించింది. మోదీ వంటి నాయకుడిని కలిగి ఉండటం నిజంగా మన అదృష్టమని పేర్కొంది. దేశం కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోగలదని విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పిన సందేశాన్ని అనుసరించాలని సూచించింది. మన ప్రేమాభిమానాలతోపాటు దేశ సమైక్యతను చాటి చెప్పుదాం అని పేర్కొంది. ఇలాంటి సమయంలో జాతి వ్యతిరేకులను పట్టించుకోకండని తెలిపింది. కాగా గతంలోనూ మోదీ అనుసరించిన విధానాలను కొనియాడుతూ రంగోలీ పలుమార్లు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. (కరోనాపై పోరు: ప్రధాని మోదీ వీడియో సందేశం)