31న `ఎవడు` చిత్రం రిలీజ్ చేస్తున్నాం : దిల్ రాజు

31న `ఎవడు` చిత్రం రిలీజ్ చేస్తున్నాం : దిల్ రాజు

‘‘ఇప్పటివరకూ మా సంస్థలో యూత్‌ఫుల్, ఫ్యామిలీ సినిమాలు వచ్చాయి. అవి విజయం సాధించినప్పటికీ కమర్షియల్ సినిమాతో కూడా సక్సెస్ అవ్వాలనే డ్రీమ్ ఉంది. ఆ కల ఈ చిత్రంతో నెరవేరుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘దిల్’ రాజు. రామ్‌చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘ఎవడు’. ఈ 31న సినిమాని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ -‘‘వంశీ ఈ కథ చెప్పినప్పుడు ట్రెండ్ సెట్ చేసే సినిమా అవుతుందనిపించింది.

 

  కథ విన్నప్పుడు ఎంత ఎగ్జయిట్ అయ్యానో, సినిమా చూస్తున్నప్పుడు అంతే ఎగ్జయిట్ అయ్యాను. చరణ్ ఇప్పటివరకు చేసిన ఐదు సినిమాల్లో మూడు సినిమాలు కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించాయి. తన ‘మగధీర విడుదలైన రోజున ఈ సినిమాని విడుదల చేస్తున్నాం. వాస్తవానికి ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆలస్యం అయ్యింది.

 

  ఇది పూర్తిగా దర్శకుడి సినిమా. మా సంస్థలో వంశీకిది మూడో సినిమా. ఈ సినిమా ప్రారంభం నుంచి పడిన కష్టాన్ని మాటల్లో చెప్పలేను. అల్లు అర్జున్ పాత్ర నిడివి పది నిముషాలే అయినా సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు. పవన్‌కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రం విడుదలకు ఈ సినిమాకి మధ్య పెద్దగా గ్యాప్ లేదనే ప్రశ్నకు సమాధానంగా -‘‘ఆ సినిమా విడుదల తేదీని ముందే ప్రకటించారు. అలాగే ‘జంజీర్’ విడుదల తేదీ కూడా ఖరారయ్యింది.

 

  అందుకని 31న విడుదల చేస్తున్నాం. గతంలో గదర్, లగాన్ విడుదలకు మధ్య పెద్దగా గ్యాప్ లేకపోయినా, రెండూ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాయి. ఆ విధంగా ఈ రెండు చిత్రాలు ఘనవిజయం సాధిస్తాయని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు ‘దిల్’ రాజు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘చిరంజీవిగారు, చరణ్‌ల ప్రోత్సాహాన్ని మర్చిపోలేను.

 

  ఈ సినిమా నా కెరీర్‌కి మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. సినిమా బాగా రావడానికి మొత్తం టీమ్ అంతా కారణం. బన్నీ ఒప్పుకోకపోతే ఈ సినిమా లేదు. రాజుగారు, చరణ్ అవుట్‌పుట్ చూసి హ్యాపీ ఫీలయ్యారు’’ అని చెప్పారు. శ్రతిహాసన్, అమీ జాక్సన్ నాయికలుగా కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్ర చేసిన ఈ చిత్రానికి సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top