ముందు నాగ్ తోనే.. తర్వాతే ఎన్టీఆర్..!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, కొంత కాలం క్రితం తెలుగు సినిమాలకు గుడ్ బై చెపుతున్నానంటూ ప్రకటించాడు. వంగవీటి సినిమా ప్రమోషన్ సందర్భంగా ఇంతకంటే మంచి కథ తెలుగులో నేను రూపొందించలేను అందుకే ఇదే నా చివరి తెలుగు సినిమా అంటూ చెప్పాడు. అయితే ఆ మాట మీద కొద్ది రోజులు కూడా నిలబడలేకపోయాడు ఈ క్రియేటివ్ జీనియస్.
వంగవీటి తరువాత కూడా వరుసగా తెలుగులో సినిమాలు ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ తాజాగా రెండు క్రేజీ ప్రాజెక్ట్ లతో హడావిడి చేస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను టార్గెట్ చేసిన వర్మ, కింగ్ నాగార్జున హీరోగా ఓ కమర్షియల్ సినిమా కూడా చేస్తున్నాడు. అయితే వరుసగా లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించే మాట్లాడుతున్న వర్మ ముందుగా నాగార్జున సినిమానే సెట్స్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాడట.
ఇటీవల రాజుగారి గది 2తో ఆకట్టుకున్న నాగ్, ప్రస్తుతం అఖిల్ హీరోగా నిర్మిస్తున్న 'హలో' మీద దృష్టి పెట్టాడు. ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుంది. అయితే ఈ లోపే వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు నాగ్. నవంబర్ లో సినిమాను ప్రారంభించి 2018 మార్చి కల్లా రిలీజ్ చేయాలని వర్మ ప్లాన్ చేస్తున్నాడట. ఆ తరువాతే లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రారంభం కానుంది.
సంబంధిత వార్తలు