యాత్ర మళ్లీ మొదలు!
‘బ్యాక్ టు షూట్ ఎగైన్’ అంటున్నారు మంచు విష్ణు. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగ్ ఆ మధ్య మలేసియాలో జరిగినప్పుడు విష్ణు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఓ రిస్కీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నప్పుడు బైక్ మీద నుంచి అమాంతం పడిపోయారు విష్ణు. తీవ్రంగా గాయపడ్డారు. డాక్టర్ల సలహా మేరకు దాదాపు నెల రోజులు విశ్రాంతి తీసుకున్నారు. కాస్త ఫర్వాలేదనిపించడంతో ఇక నో రెస్ట్ అని ఫిక్స్ అయ్యారు. నిజానికి ఇంకొన్నాళ్లు రెస్ట్ అవసరమైనప్పటికీ, తన కారణంగా షూటింగ్కి ఆటంకం కలగడంతో విష్ణు మళ్లీ సెట్స్లోకి ఎంటరవ్వడానికి నిర్ణయించుకున్నారు.
‘‘మళ్లీ షూటింగ్ మొదలుపెడుతున్నాం. లండన్, డబ్లిన్, లాస్ ఏంజిల్స్లో లాంగ్ షూట్ చేయబోతున్నాం’’ అని విష్ణు పేర్కొన్నారు. చిత్రనిర్మాతలు కీర్తీ చౌదరి, కిట్టు మాట్లాడుతూ– ‘‘గాయాలు బాగా తగిలినప్పటికీ విష్ణు చాలా త్వరగానే కోలుకున్నారు. అందుకే త్వరగా షూటింగ్ రీ–స్టార్ట్ చేయగలిగాం’’అన్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, ఎల్.బి. శ్రీరామ్, విద్యుల్లేఖా రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి, పృథ్వీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: సిద్ధార్థ, సమర్పణ: ఎం.ఎల్. కుమార్చౌదరి.