ఇరవైమూడేళ్ల తర్వాత ‘అల్లరి’ కాంబినేషన్!

ఇరవైమూడేళ్ల తర్వాత ‘అల్లరి’ కాంబినేషన్! - Sakshi


 ‘ముద్దిమ్మంది ఓ చామంతి...’ అంటూ రమ్యకృష్ణ, మీనాలతో ‘అల్లరి మొగుడు’గా మోహన్‌బాబు చేసిన రొమాన్స్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తే. మంచి మ్యూజికల్ హిట్‌గా సిల్వర్ జూబ్లీ సాధించిందా చిత్రం. ఈ సినిమా విడుదలైన 23 ఏళ్లకు మళ్లీ మోహన్‌బాబు, రమ్యకృష్ణ, మీనా వెండితెరపై సందడి చేయనున్నారు. వీళ్ల అల్లరిలో ‘అల్లరి’ నరేశ్ కూడా భాగం అవుతున్నారు. నరేశ్ సరసన పూర్ణ కథానాయికగా నటించనున్నారు. టైటిల్ రోల్స్‌లో మోహన్‌బాబు, నరేశ్ నటించనున్న ఈ చిత్రానికి ‘మామ మంచు... అల్లుడు కంచు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

 

 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మించనున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడు. త్వరలో షూటింగ్ ఆరంభం కానుంది. ఈ చిత్రానికి అచ్చు, బప్పా లహరి, రఘు కుంచె పాటలు స్వరపరుస్తున్నారు. ప్రస్తుతం పాటల రికార్డింగ్ జరుగుతోంది. ఇప్పటికి రెండు పాటలను రికార్డ్ చేశారు. అలీ, రఘుబాబు, రాజా రవీంద్ర, కృష్ణభగవాన్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, కెమెరా: బాల మురుగన్, ఆర్ట్: చిన్నా.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top