అనుకోకుండా రెండూ పదకొండు!

అనుకోకుండా రెండూ పదకొండు! - Sakshi


జనవరి 11... మహేశ్‌బాబుకు ఓ తీపి జ్ఙాపకం. ఆయన నటించిన మొదటి మల్టీస్టారర్‌ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఆ రోజునే విడుదలైంది. మంచి హిట్టయ్యింది. ఇప్పుడదే తేదీకి ‘భరత్‌ అనే నేను’ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట. ‘శ్రీమంతుడు’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌ చేయనున్న ఈ సినిమా చిత్రీకరణ ఇంకా మొదలవలేదు.



వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభించి ఐదు నెలల్లో పూర్తి చేసి, సంక్రాంతికి విడుదల చేయాలని హీరో మహేశ్, నిర్మాత డీవీవీ దానయ్య, దర్శకుడు శివల ఆలోచన అట. ఇదిలా ఉంటే... ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ‘స్పైడర్‌’ను కూడా 11వ తేదీన... అంటే ఆగస్టు 11న రిలీజ్‌ చేస్తారట. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్వీ ప్రసాద్, ‘ఠాగూర్‌’ మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేశ్‌బాబు ఇంటిలిజెన్స్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.



ఆగస్టు 9న మహేశ్‌బాబు పుట్టినరోజు. ఆయన అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్‌గా తొమ్మిదిన ‘స్పైడర్‌’ను విడుదల చేయాలనుకున్నారనే వార్త వినిపించింది. అయితే 11న విడుదల చేయాలనుకుంటున్నారన్నది తాజా టాక్‌. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఒకవేళ రెండు సినిమాల రిలీజ్‌ డేట్‌ 11 అయితే, యాదృచ్ఛికంగా అలా కుదిరి ఉంటుందేమో. కొన్ని కొన్ని అలా కుదురుతాయంతే!

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top