యువతకు అద్దంపట్టేలా...
‘ఆర్ఎక్స్ 100 ’ ఫేమ్ కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలిమ్స్ పతాకాలపై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ ఒంగోలులో జరిగింది. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ– ‘‘కొన్ని కథలు వినగానే నచ్చుతాయి. మళ్లీ మళ్లీ గుర్తుకొస్తుంటాయి. నలుగురితో పంచుకోవాలనిపిస్తుంటాయి. అర్జున్ జంధ్యాల చెప్పిన కథ అలాంటిదే. వినగానే నచ్చింది. ఒంగోలులో భారీ షెడ్యూల్ చేశాం. ప్రతి ఫ్రేమ్ రియలిస్టిక్గా వచ్చింది’’ అన్నారు. ‘‘రియలిస్టిక్ యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ ఇది. వాస్తవ ఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఈ కథ రాసుకున్నా.
ఎంతోమంది మనసులకు దగ్గరగా ఉంటుంది. హీరో పాత్ర యువతకు అద్దంపట్టేలా ఉంటుంది. అన్నిరకాల భావోద్వేగాలుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ చిత్రమవుతుంది’’ అని అర్జున్ జంధ్యాల తెలిపారు. ‘‘దాదాపు 25 రోజులు ఒంగోలులోని క్వారీలు, గ్రానైట్ ఫ్యాక్టరీలు, కాలనీలు, రిజర్వాయర్లలో షూటింగ్ చేశాం. కీలకమైన టాకీ పోర్షన్, ఒక పాట, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించాం. దీంతో దాదాపుగా 40 శాతం షూటింగ్ ముగిసింది. మార్చి 5 నుంచి యూరప్లోని క్రొయోషియాలో రెండు పాటలను తెరకెక్కిస్తాం’’ అన్నారు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్, కెమెరా: ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ మల్లాల.