దీపికకు ఆ హక్కుంది
జేఎన్యూ సందర్శనపై కంగనరనౌత్
నగర మహిళలతో ముఖాముఖి
బాలీవుడ్ క్రేజీ నటి కంగనా రనౌత్ నగరానికి వచ్చారు. తన తాజా చిత్రం ప్రమోషన్ సహా పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అదే క్రమంలో నగరానికి చెందిన ఫిక్కీ లేడీస్ క్లబ్ దిపార్క్ హోటల్లో నిర్వహించిన ముఖాముఖిలోనూ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలు అంశాలపై తనదైన రీతిలో స్పందించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...
అది దీపిక ప్రాథమిక హక్కు
జేఎన్యూ యూనిర్సిటీలో ఇటీవల జరిగిన దాడిలో గాయపడ్డ బాధితులను దీపిక పరామర్శించడాన్ని ఎందుకు తప్పుపట్టాలి. తనకు నచ్చిన చోటుకి వెళ్లడం ఆమె ప్రాథమిక హక్కు కదా. తనకేది మంచిదో తనకి బాగా తెలుసు. రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన దాడులకు రాజకీయ రంగు పులిమి జాతీయ సమస్యగా చేయవద్దని నా మనవి.
ముత్యంలాంటి నగరమిది...
హైదరాబాద్ సిటీతో పాటు ఇక్కడ లభించే ముత్యాలంటే నాకెంతో ఇష్టం. ఇక్కడి పెరల్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడకు వచ్చినప్పుడల్లా బిర్యానీ, ఆంధ్రా రసం, బగారా బైగాన్, కొబ్బరి పాయసం... వంటివి రుచి చూడకుండా వెళ్లను.
రైటింగ్ కన్నా దర్శకత్వం మిన్న
నేను రచనలో శిక్షణ పొంది ఉన్నప్పటికీ దర్శకత్వం అంటేనే నాకిష్టం. డైరెక్టర్కి ఆల్ రౌండ్ లీడర్ షిప్ లక్షణాలు కావాలి. అది చాలా ఛాలెంజింగ్ రోల్. ఐ లవ్ డైరెక్టర్ జాబ్. టైటానిక్, జురాసిక్ పార్క్ వంటి బ్లాక్ బస్టర్స్ని కూడా పాశ్చాత్యులు కేవలం 70, 80 రోజుల్లో తీసేస్తున్నారు. కాని బాలీవుడ్లో ఏదైనా భారీ చిత్రం అంటే ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఎంత కాలం మనం సెట్స్ మీద ఉంటే అంత ఎక్కువగా నిర్మాణ వ్యయం పెరుగుతుంది. మన దగ్గర ఇది మారాల్సి ఉందనిపిస్తుంది.
నో సోషలైజింగ్...
సోషల్ మీడియా అనేది ఒక వర్చువల్ ప్రపంచం. అదొక భిన్న ప్రపంచం. నేను ఇప్పటికే ఒక ఒక ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి తంటాలు పడుతున్నా. రెండు ప్రపంచాలు ఒకేసారి నేను మేనేజ్ చేయలేను. అంతేకాదు సోషల్ మీడియా కోసం చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అది నా వల్ల కాదు. అందుకే సోషల్ మీడియాలో నేను మీకు కనిపించను.