విశాల్కు ఆదాయపు పన్ను శాఖ సమన్లు
తమిళసినిమా (చెన్నై): తమిళ నటుడు విశాల్కు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సమన్లు జారీచేశారు. 27వ తేదీన తమ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించారు. చెన్నై, వడపళనిలోని విశాల్ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తనిఖీల్లో విశాల్ రూ. 51 లక్షల పన్ను చెల్లించలేదని తెలిసినట్టు సమాచారం. విశాల్ కార్యాలయం నుంచి కొన్ని కీలక ఆధారాలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ విశాల్ మెర్శల్ చిత్రానికి మద్దతు తెలపడం, చిత్రాన్ని ఇంటర్నెట్లో చూసిన బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజాను తప్పుపట్టడం వల్లే ఆయన కార్యాలయంపై దాడులు జరిగాయంటున్నారు.
నటుడు విశాల్ మాత్రం తన ఆదాయానికి సంబంధించిన లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయన్నారు. ఒకవేళ తనపై కక్ష సాధింపుచర్యలకు పాల్పడితే తగువిధంగా ఎదుర్కొంటానని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో చాలా ముఖ్యమైన సమస్యలున్నాయని, వాటిపై దృష్టిపెట్టాలని ప్రతిఒక్కరికి సూచించారు.