పారితోషికం పెంచేసిన విజయ్‌ దేవరకొండ హీరోయిన్‌!

Did Rashmika Mandanna Double Hiked Her Remuneration - Sakshi

ఇప్పుడు నటీనటులకు విజయాలు ఆనందంతో పాటు పారితోషికాలను పెంచేస్తాయి. అవే దర్శక నిర్మాతలకు షాక్‌ ఇస్తుంటాయి. తాజాగా అలా దర్శక నిర్మాతలకు షాకిస్తున్న నటి రష్మిక. ఈ కన్నడ బ్యూటీ మాత్రభాషలో కంటే కూడా తెలుగులోనే ఎక్కువ క్రేజ్‌ను సంపాదించుంది. గీతగోవిందం అనే ఒక్క చిత్రం ఈ అమ్మడిని ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ను చేసేసింది. ఆ తరువాత నాగార్జున, నాని కలిసి నటించిన దేవదాస్‌ చిత్రం, మరోసారి విజయ్‌దేవరకొండతో డియర్‌ కామ్రేడ్‌ వంటి చిత్రాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంది. డియర్‌ కామ్రేడ్‌ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైంది. కాగా అంతకుముందే కోలీవుడ్‌లో విజయ్‌తో నటించే అవకాశం వరించిందనే ప్రచారం హోరెత్తింది. అయితే అది వదంతిగానే మారింది. ప్రస్తుతం కార్తీకి జంటగా ఒక చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. కాగా టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంలో నటిస్తోంది. దీంతో రష్మికకు మరింత డిమాండ్‌ పెరిగిందనే చెప్పాలి. 

దీంతో ఒక్కసారిగా పారితోషికాన్ని పెంచేసిందట. ఇది ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారింది. అయితే రష్మిక పారితోషికం పెంచడం గురించి ఆమె అనుసరవర్గాలు స్పందించారు. రష్మిక నటించిన మూడు చిత్రాలు వరుసగా సక్సెస్‌ అయ్యాయని, దీంతో సాధారణంగానే పారితోషికం పెరిగిందని అన్నారు. అయితే అధిక పారితోషికం డిమాండ్‌ చేస్తూ ఎవరినీ ఒత్తిడి చేయడం లేదని పేర్కొన్నారు. అయినా కారణం లేకుండా పారితోషికాన్ని ఎవరూ పెంచరని కూడా అంటున్నారు. నటి రష్మిక పారితోషికాన్ని పెంచిందన్న విషయాన్ని వారూ అంగీకరించారు. ఇది దర్శక నిర్మాతలకు షాక్‌ ఇచ్చే విషయం కాక ఏమవుతుందనే ప్రశ్న సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. కోలీవుడ్‌  విషయానికి వస్తే ఈ అమ్మడు ఒకే ఒక చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం కార్తీతో నటిస్తున్న చిత్రంపైనే రష్మిక భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. చూద్దాం ఆ చిత్రం ఈ అమ్మడిని ఎక్కడ నిలబెడుతుందో!  
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top