నిర్మాత దిల్ రాజుపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దిల్ రాజు (వెంకట రమణా రెడ్డి)త పాటు మరో నలుగురిపై మాధాపూర్ పీఎస్ లో కేసు నమోదైంది. ముమ్మిడి శ్యామలా రాణి తాను 2006లో రాసిన 'నా మనసు కోరింది నిన్నే' నవల ఆధారంగా అనుమతి తీసుకోకుండా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తీశారని పోలీసులను ఆశ్రయించారు. అప్పట్లో ఆమె నవల ఆధారంగా సినిమా తీసేందుకు ప్రయత్నించినా ఎవరూ ముందుకు రాలేదు. తరువాత 2008లో హితి పబ్లిషర్స్ తీసుకోని 2010లో అచ్చువేశారు. సినిమా ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2011లో ఆగస్టులో రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. అయితే ఇన్నేళ్ల తరువాత కేసు వేయటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సినిమాలో ప్రతీ సీను తన నవలలో ఉన్నట్టుగానే చిత్రీకరించారని ఆరోపించిన శ్యామల, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు దశరథ్ లపై 120 ఎ, 415, 420, తో పాటు కాపీ రైట్ యాక్ట్ సెక్షన్ 63 కింద కేసు నమోదు చేశారు. ఇటీవల టీవీలో ప్రసారం అయినప్పుడు సినిమా చూసిన శ్యామల నిర్మాతపై ఆరోపణలు చేయకుండా ఎవరో తన కథను వాళ్ల కథగా దిల్ రాజుకు వినిపించారని తెలిపారు. సినిమాలో 28 సీన్లు తన నవల ఆధారంగానే తెరకెక్కాయని, ఇక మీదట మరే భాషలో అయిన ఈ సినిమా రీమేక్ చేస్తే తన పేరును టైటిల్ లో వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.