వినోదం పంచడమే నా లక్ష్యం

AVSR Swamy speech at Rahu Movie - Sakshi

‘‘సినిమా తీయడం గొప్ప కాదు.. మార్కెటింగ్‌ చెయ్యగలగాలి. అలాంటి వ్యక్తులే సినిమాలు తీయాలి. మా సినిమా నచ్చడంతో సురేష్‌బాబుగారు విడుదల చేస్తున్నారు. నా డబ్బు తిరిగి వస్తుందనే నమ్మకంతో ‘రాహు’ సినిమా నిర్మించాను’’ అన్నారు నిర్మాత ఏవీఎస్‌ఆర్‌ స్వామి. అభిరామ్‌ వర్మ, కృతీ గార్గ్‌ జంటగా సుబ్బు వేదుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాహు’. ఏవీఎస్‌ఆర్‌ స్వామి, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏవీఎస్‌ఆర్‌ స్వామి మాట్లాడుతూ– ‘‘నాది చీరాల. నేను సినిమాలు ఎక్కువగా చూస్తాను కానీ సినిమా గురించి నాకు ఏ మాత్రం తెలియదు.

సుబ్బుగారు చెప్పిన కథ నచ్చి నిర్మాతగా మారాను. నేను బయో టెక్నాలజీ వ్యాపారంలో లాభాలు చూస్తున్నాను. సినిమా అనేది గ్యారెంటీ లేని ఫీల్డ్‌.. సక్సెస్‌ రేటు తక్కువ. అయితే ఈ చిత్రాన్ని సంపాదన కోసం చేయలేదు. ప్రేక్షకులకు వినోదం పంచడమే నా లక్ష్యం. కొత్త తరహా థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. హీరోయిన్‌ జీవితంలో ఒక రాహు ఉంటాడు. తన జీవితంలోకి వచ్చిన రాహుపై తను ఎలా పోరాడుతుంది? అనేది ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నచ్చిన కథలు వస్తే తప్పకుండా మరికొన్ని సినిమాలు నిర్మిస్తాను. సుబ్బుగారితోనూ మరిన్ని చిత్రాలు చేయడానికి సిద్ధం. ‘రాహు’ సినిమా విడుదలకు నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌ సహకారం అందించారు’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top