మెగాఫోన్‌ పట్టనున్న అనుపమ

Anupama Training in Assistance Direction - Sakshi

సినిమా: మాలీవుడ్‌ చిత్రం ప్రేమమ్‌ ఏకంగా ముగ్గురు కథానాయికలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది. నటి సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్‌ ఆ ముద్దుగుమ్మలు. లక్కీగా ఈ ముగ్గురు బ్యూటీస్‌కు దక్షిణాదిలో అవకాశాలు వస్తున్నాయి. అయితే నటి అనుపమ పరమేశ్వరన్‌కు కోలీవుడ్‌లో ధనుష్‌తో నటించిన కొడి మినహ మరో అవకాశం ఇప్పుటి వరకూ రాలేదు. మాలీవుడ్, టాలీవుడ్, శాండిల్‌వుడ్‌ల్లో అవకాశాలు బాగానే ఉన్నాయి. కాగా నటి సాయిపల్లవి అవకాశాలు రాకపోతే డాక్టరునైన తాను వైద్యం చేసుకుంటానని అంటోంది. ఇక నటి అనుపమ మాత్రం నటిగా అవకాశాలు వస్తున్నా, తన ఆసక్తి, ఆశ మరో శాఖపైకి మళ్లుతున్నాయి. అవును ఆమె దృష్టి దర్శకత్వంపైకి మళ్లింది.

తాను మెగాఫోన్‌ పట్టే తీరుతాను అని నిర్ణయం తీసుకుందట. అంతే అందులో మెళకువలు తెలుసుకునే ప్రయత్నంలో పడింది. సమయం దొరికినప్పుడల్లా దర్శకత్వం శాఖపై దృష్టి పెడుతున్న నటి అనుపమ పరమేశ్వరన్‌ ఇటీవల నటిగా విరామం రావడంతో సహాయ దర్శకురాలిగా మారిపోయింది. మలయాళంలో నటుడు దుల్కర్‌ సల్మాన్‌ సొంతంగా నిర్మిస్తున్న చిత్రానికి సహాయ దర్శకురాలిగా మారిపోయిందట. అంతే కాదు త్వరలోనే దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేసుకుంటోందట. అయితే ఇక ఈ బ్యూటీని నటిగా మరచిపోవాల్సిందేనా? అని చింతించనవసరం లేదట. దర్శకత్వం చేయాలన్నది తన కోరిక అని, అందుకే మెగాఫోన్‌ పట్టాలనుకుంటున్నానని, నటిగానూ కొనసాగుతానని అనుపమ పరమేశ్వరన్‌ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ అమ్మడు దర్శకత్వంలో చిత్రం చేయడానికి ముందుకొచ్చే ఆ నిర్మాత ఎవరో అలా పిల్లికి గంట కట్టేదెవరో వేచి చూద్దాం. మొత్తం మీద మరో మహిళా దర్శకురాలు తయారవుతోందన్న మాట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top