విలేకరుల సమావేశం.. రిపోర్టర్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన అక్షయ్‌

Akshay Kumar Answer Reporter Phone Mission Mangal Press Conference - Sakshi

తన ప్రొఫెషన్‌ పట్ల హీరో అక్షయ్‌ కుమార్‌ ఎంత నిబద్ధతగా ఉంటారో అందరికి తెలిసిందే. ప్రస్తుతం అక్షయ్‌ మిషన్‌ మంగళ్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ వెరైటీ సంఘటన చోటు చేసుకుంది. ప్రమోషన్‌ కార్యక్రమంలో భాగంగా ఓ విలేకరి అక్షయ్‌ అండ్‌ టీం మాటలను రికార్డ్‌ చేయాలని తన ఫోన్‌ను వారి ముందు పెట్టాడు. అయితే దాన్ని సైలెంట్‌లో పెట్టడం మర్చిపోయాడు. ఇక సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన కీర్తి కుల్హరీ మాట్లాడుతుండగా విలేకరి ఫోన్‌ ఒక్కసారిగా మోగింది.

వెంటనే అక్షయ్‌ కుమార్‌ ఫోన్ తీసుకుని ‘హలో.. కృష్ణా జీ, నేను అక్షయ్‌ను మాట్లాడుతున్నాను. మేం విలేకరులు సమావేశంలో ఉన్నాం. ఇది పూర్తయ్యాక నేను ఫోన్‌ చేస్తాను’ అని మాట్లాడి ఫోన్‌ కట్‌ చేశారు. అక్షయ్‌ చేసిన పనికి అక్కడున్న వారందరూ ఒక్కనిమిషం ఆశ్చర్యపోయినా తర్వాత తేరుకుని నవ్వుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు అక్షయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకే ఆయన సూపర్‌స్టార్‌ అయ్యారంటూ కామెంట్‌ చేస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘మిషన్‌ మంగళ్‌’ ఈ నెల 15న విడుదలవుతుంది. ఈ చిత్రంలో విద్యా బాలన్‌, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరీ, నిత్యా మేనన్‌, తాప్సీ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top