వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పిన అక్షరహాసన్‌

Akshara Haasan ok to Web Series - Sakshi

సినిమా: కమలహాసన్‌ ఇద్దరు కూతుళ్లు శ్రుతీహాసన్, అక్షరహాసన్‌లు తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. వీరిలో శ్రుతీహాసన్‌ ఇప్పటికే స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. రెండో కూతురు అక్షరహాసన్‌ సైతం ఇదే ప్రయత్నంలో ఉంది. అయితే ఇద్దరూ హిందీ చిత్రాలతోనే నటిగా ఎంట్రీ ఇచ్చారు. శ్రుతీహాసన్‌ లక్‌ చిత్రంతో పరిచయం కాగా, అక్షరహాసన్‌ సమితాబ్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే అమితాబ్‌బచ్చన్, తమిళ నటుడు ధనుష్‌తో కలిసి నటించింది. అయినా ఆ తరువాత ఎక్కువ చిత్రాల్లో నటించలేదు. ఆ మధ్య అజిత్‌ హీరోగా నటించిన వివేగం చిత్రంలో గెస్ట్‌గా మెరిసింది. ఆ తరువాత ఇటీవల తన తండ్రి కమలహాసన్‌ నటుడు విక్రమ్‌ హీరోగా నిర్మించిన కడారం కొండాన్‌ చిత్రంలో కీలక పాత్రను పోషించింది.

ఇలా ముఖ్య పాత్రల్లోనే కానీ హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దక్కించుకోలేదు. ఇలాంటి పరిస్థితిలో నటి అక్షరహాసన్‌కు కథానాయకిగా నటించే అవకాశం వచ్చింది. అయితే అది సినిమాలో కాదు. వెబ్‌ సిరీస్‌లో. నేడు వెబ్‌ సిరీస్‌లు సినిమాలకు ధీటుగా నిర్మాణం జరుగుతున్నాయి. కాజల్‌ అగర్వాల్‌ లాంటి టాప్‌ హీరోయిన్లు కూడా వెబ్‌ సిరీస్‌ వైపు దృష్టిసారిస్తున్నారు. శ్రుతీహాసన్‌ సైతం ఇటీవల ఓ హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌కు సై అంది. అక్షరహాసన్‌ తమిళ వెబ్‌ సిరీస్‌లో నటించబోతోంది అంతే తేడా. ఈ వెబ్‌ సిరీస్‌ ద్వారా నవ దర్శకుడు శివశంకర్‌ పరిచయం కానున్నాడు. ఇందులో నటి అక్షరహాసన్‌తో పాటు నటి సునైనా, గాయత్రి నటిస్తున్నారు. దీన్ని దర్శకుడు విష్ణువర్ధన్‌ నిర్మించడం విశేషం. ఈయన ఇంతకు ముందు అరిందుమ్‌ అరియామలుమ్, అజిత్‌ హీరోగా ఆరంభం, బిల్లా వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. కాగా అక్షరహాసన్‌ నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ సెల్‌ఫోన్‌ ఇతి వృత్తంతో సాగే సస్పెన్స్, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనుందని సమాచారం. మరి ఈ వెబ్‌ సిరీస్‌ అక్షరహాసన్‌ కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడుతుందో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top