ప్రజాసంకల్పయాత్ర 13వ రోజు
సాక్షి, బనగానపల్లి (కర్నూలు జిల్లా): ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమయ్యేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 13వ రోజుకు చేరుకుంది. సోమవారం బనగానపల్లి నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను మొదలుపెట్టారు. బాతులూరుపాడు, ఎన్నకొండల మీదుగా హుస్సైనపురం చేరుకున్నారు. హుస్సైనపురంలో మహిళ సదస్సులో పాల్గొన్నారు.
అనంతరం హుస్సైనపురంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మూడు గంటల సమయంలో హుస్సైనపురం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర తిరిగి ప్రారంభమయింది. పాలుకూరు క్రాస్రోడ్డు, గోవిందదిన్నెల మీదుగా డోన్ నియోజకవర్గంలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించింది. బేతంచర్ల మండలం గోర్లగుట్ట వద్ద వైఎస్ జగన్కు డోన్ నియోజకవర్గ పార్టీ నేతలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 5.30 గంటలకు ఆయన గోర్లగుట్టలో క్వారీ కార్మికులతో మాట్లాడారు. ఇక్కడితో ఈరోజు పాదయాత్ర ముగించి రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేశారు. ఈరోజు వైఎస్ జగన్ 13.5 కిలోమీటర్లు నడిచారు. 13 రోజుల పాటు చేసిన పాదయాత్రలో వైఎస్ జగన్ 182.8 కిలోమీటర్లు నడిచారు.