రోడ్డు ప్రమాదం...ఇద్దరు దుర్మరణం

కొణిజర్ల: ఇద్దరు వైద్య విద్యార్థుల(మెడికోస్‌)లను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు బలిగొంది. వీరు వెళుతున్న కారును కంటైనర్‌ లారీ ఢీకొంది. తనికెళ్ల సమీపంలో శనివారం సాయంత్రం ఇది జరిగింది. వైరా సీఐ మల్లయ్య స్వామి తెలిపిన వివరాలు... 

గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని శ్రీరామపురం ప్రాంతానికి చెందిన డాక్టర్‌ బండారు సిద్ధార్థ(27), పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని నలజర్ల గ్రామానికి చెందిన డాక్టర్‌ పులివర్తి సూర్యకిరణ్‌(31), ఖమ్మంలోని మమత మెడికల్‌ కళాశాలలో పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్నారు. సూర్యకిరణ్‌.. కార్డియాలజీలో ఎండీ డీఎం, సిద్ధార్థ«.. అనస్తీషియా విభాగంలో పీజీ చేస్తున్నారు. శనివారం కళాశాలకు సెలవు. సరదాగా గడిపేందుకు వైరా వైపు కారులో వెళ్లి, సాయంత్రం తిరిగొస్తున్నారు. తనికెళ్ల వద్ద వీరి కారును వెనుక నుంచి వచ్చిన కంటైనర్‌ లారీ ఢీకొంది. కారు పూర్తిగా ధ్వంసమైంది. డాక్టర్‌ సిద్ధార్థ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన సూర్యకిరణ్, మమత ఆస్పత్రిలో మృతిచెందాడు.

 సూర్యకిరణ్‌కు గత ఏడాదే వివాహమైంది. ఆయన భార్య కూడా పీజీ వైద్య విద్యార్థిని. సిద్ధార్థ అవివాహితుడు. కారులో చుక్కుకున్న డాక్టర్‌ సిద్ధార్థ మృతదేహాన్ని  పోలీసులు అతి కష్టంగా జేసీబీ సాయంతో బయటకు తీయించారు. ఈ ప్రమాదంతో రోడ్డుకు ఇరువైపులా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను వైరా సీఐ మల్లయ్య స్వామి, కొణిజర్ల, తల్లాడ, రఘునాధపాలెం ఎస్‌ఐలు వి.సురేష్, ఎం.ప్రసాద్, ఆర్‌.కృష్ణ  క్రమబద్ధీకరించారు. సిద్ధార్థ మృతేదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ మల్లయ్య స్వామి పర్యవేక్షణలో కేసును ఎస్‌ఐ సురేష్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top