నియంతకు అమెరికా, దక్షిణ కొరియాలు ఝలక్!
ప్యోంగ్ యాంగ్ : అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా ఉత్తర కొరియాపై కయ్యానికి కాలు దువ్వుతున్నాయంటూ ఆ దేశ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం అమెరికా బీ-1బీ బాంబులను నార్త్ కొరియాలోని కొన్ని ప్రదేశాల్లో జారవిడిచి మాక్ డ్రిల్ నిర్వహించినట్లు స్థానిక మీడియా కేసీఎన్ఏ శుక్రవారం కథనాలు ప్రసారం చేసింది. వరుస క్షిపణి పరీక్షలతో జపాన్, అమెరికా, చైనా దేశాలకు దడ పుట్టిస్తూ.. ఆయా దేశాధినేతల హెచ్చరికలను నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ బేఖాతరు చేస్తున్నందునే మాక్ డ్రిల్ తో తమ ఉద్దేశాన్ని స్పష్టం చేశాయి.
అమెరికా, దక్షిణ కొరియాలు యుద్ధ విమానాలతో గువాంలోని అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్ నుంచి తమపై మాక్ డ్రిల్ నిర్వహించాయని, తద్వారా హెచ్చరికలు పంపాలని చూడటంపై నార్త్ కొరియా మండిపడుతోంది. అయితే తమ బలగాలను మోహరించినట్లుగానీ, యుద్ధ విమానలతో దాడులు చేయడానికి సన్నద్ధమైనట్లుగా అమెరికా, దక్షిణ కొరియాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని తమ కథనాలలో పేర్కొంది.