కిమ్ తల నరకడానికి స్పెషల్ టీం
సియోల్ : వరుస అణు పరీక్షలతో చెలరేగుతున్న ఉత్తర కొరియాను భయపెట్టేందుకు దక్షిణ కొరియా కొత్త వ్యూహం సిద్ధం చేసింది. అర్థరాత్రి సమయాల్లో సరిహద్దు దాటి వెళ్లి ఉత్తర కొరియన్ల తలలు నరుక్కురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపింది. 'స్పార్టన్ 3000' పేరుతో ఓ టీంను ఇందుకోసం తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ చర్య ద్వారా ఉత్తర కొరియా లీడర్ కిమ్ జాంగ్ ఉన్ను భయ భ్రాంతులకు గురి చేయాలని దక్షిణ కొరియా భావిస్తున్నదని నిపుణులు అంటున్నారు.
దక్షిణ కొరియాకు ఇది కొత్తేమీ కాదు..
ఉత్తరకొరియాలోకి చొరబాటు చేసి ఆ దేశాధినేత కిమ్ సంగ్ 2ను చంపడానికి దక్షిణ కొరియా గతంలో చేసిన ప్రయత్నం విఫలమైంది. 1960లో జరిగిన ఈ ఘటనలో దక్షిణ కొరియా శిక్షణలో ఆరితేరిన కమాండోలు కిమ్ సంగ్ 2 గొంతు కోసి చంపేందుకు ఉత్తర కొరియా అధ్యక్ష భవనంలోకి చొరబాటు చేశారు. సంగ్ను అంతమొందించే ప్రయత్నం విఫలం చెందడంతో కమాండోల్లో కొందరు ఉత్తర కొరియన్ల చేతికి చిక్కకుండా ప్రాణాలు తీసుకోగా, కొందరు పారిపోయి దక్షిణ కొరియాకు తిరిగి వచ్చారు. ఆనాటి నుంచి దక్షిణ కొరియా అలాంటి ప్రయత్నాలను విరమించుకుంది.
మళ్లీ ఇప్పుడు దేనికీ..
ఉత్తర కొరియా అణు పరీక్షలు దక్షిణ కొరియాను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. చర్చలకు సిద్ధమని, సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుందామని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ సంకేతాలు పంపినా కిమ్ వారి మాటలను పట్టించుకో లేదు. తలలు నరికే కార్యక్రమంతో కిమ్ను భయపెట్టి దారికి తీసుకురావాలనేది దక్షిణ కొరియా వ్యూహం. ఈ ఏడాది చివరికల్లా 'స్పార్టన్ 3000' టీంను రంగంలోకి దించుతామని దక్షిణ కొరియా రక్షణ శాఖ మంత్రి సాంగ్ యంగ్ మూ తెలిపారు.
స్పార్టన్ టీం హెలికాప్టర్లు, ట్రాన్స్పోర్టు విమానాలతో అర్థరాత్రి పూట బోర్డర్ దాటి వెళ్లి శత్రువుల తలలు నరికి తెస్తుందని చెప్పారు. అయితే, దక్షిణ కొరియా ఈ నిర్ణయం వెనుక అమెరికా కూడా ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కిమ్, ఆయన కీలక అధికారులను హతమార్చడానికే ఇరు దేశాలు ఈ ప్రోగ్రామ్ను చేపట్టివుండొచ్చని చెబుతున్నారు.