పాక్ ప్రధానిని అవమానించిన అమెరికా
దౌత్యస్థాయిలో స్వాగతం పలుకని వైనం
వాషింగ్టన్: అసలే ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రైవేటు జెట్ విమానానికి బదులు.. ఖతార్ ఎయిర్వేస్కు చెందిన ఓ కమర్షియల్ విమానంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమెరికాకు వెళ్లారు. అక్కడ, వాషింగ్టన్లోని డ్యులెస్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఆయనకు.. అమెరికా ఉన్నతస్థాయి అధికారులు ఎదురొచ్చి స్వాగతం పలుకలేదట. అక్కడి నుంచి పెద్దగా ఆర్భాటం లేకుండా మెట్రోరైల్లో ప్రయాణిస్తూ.. ఇమ్రాన్ నేరుగా పాక్ రాయబారి ఇంటికి వెళ్లిపోయారు. ఈ పరిణామంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధానమంత్రి పర్యటనకు వస్తే.. దౌత్యపరంగా స్వాగతం పలికేందుకు ఉన్నతాస్థాయి అధికారులు ఎవరూ రాకపోవడం.. ఘోరంగా అవమానించడమేనని నెటిజన్లు అంటున్నారు. ఇక, దౌత్యపరమైన అధికారిక స్వాగతం కోసం పాకిస్థాన్ 25 వేల డాలర్లను అమెరికాకు ఇచ్చేందుకు ముందుకొచ్చింది కూడా. ఆ ఆఫర్ను తిరస్కరించిన అగ్రరాజ్యం యంత్రాంగం ఇమ్రాన్కు ఆయన హోదాకు తగినట్టు స్వాగతం పలుకకపోవడం ద్వారా అవమానానికి గురిచేసింది. తాత్కాలిక ప్రొటోకాల్ చీఫ్ మేరీ కేట్ ఫిషర్ మాత్రమే ఇమ్రాన్కు స్వాగతం పలికేందుకు వచ్చారు. ఈ క్రమంలో పాక్ విదేశాంగ మంత్రి షా ఖురేషీ ఎయిర్పోర్టులో ఇమ్రాన్ను ఎదుర్కొని.. మెట్రోలో ఆయన వెంట రాయబారి నివాసం వరకు వెళ్లారు. అయితే, ఈ విషయంలో వస్తున్న విమర్శలను అమెరికా విదేశాంగ శాఖ తోసిపుచ్చింది.