సింగపూర్లో 88 ఏళ్ల వ్యక్తి మృతి
సింగపూర్ : కరోనా కారణంగా 88 ఏళ్ల వ్యక్తి మరణించాడు. వారంలో ఇది నాలుగో మరణం. దీంతో అక్కడ మరణాల సంఖ్య ఆరుకు చేరినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. కరోనా లక్షణాలతో మార్చి 30న ఆసుపత్రిలో చేరిన ఆయనకు ఇదివరకు పలు ఆరోగ్య సమస్యలున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక సింగపూర్లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,114కు పెరిగింది.
ప్రధానమంత్రి లీ హ్సేన్ శుక్రవారం 5.6 మిలియన్ సింగపూర్ వాసులతో ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతూ.. దేశవ్యాప్త లాక్డౌన్ను అమలుచేస్తున్నట్లు ప్రకటించారు. పిల్లలకు ఇంటి నుంచే పాఠాలు చెప్పాలని టీచర్లకు సూచించారు. కార్యాలయాలు ఇంటి నుంచే పనిచేయాలని అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న వేళ కఠిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందన్నారు. ఆసుపత్రులు, సూపర్ మార్కెట్లు, బ్యాంకింగ్ లాంటి అత్యవసర సేవలు మినహా అన్ని కార్యాలయాలు మూసివేస్తున్నట్లు తెలిపారు.
సంబంధిత వార్తలు