ఉగ్రసాయం ఆపండి

ఉగ్రసాయం ఆపండి - Sakshi


ఖతర్‌కు ట్రంప్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌: ఉగ్రవాదులకు ఖతర్‌ ఆర్థిక సాయం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపిం చారు.  సౌదీ అరేబియా నేతృత్వంలోని అరబ్‌ దేశాల కూటమికి ఖతర్‌కు మధ్య వివాదం రోజు రోజుకూ ముదురుతున్న నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వైట్‌హౌస్‌లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  ‘ఉగ్రవాదానికి సాయం ఆపడంతో పాటు విద్వేష ప్రచారం, హత్యలకు ముగింపు పలకాలంటూ’ ఖతర్‌ని హెచ్చరించారు. కొన్నేళ్లుగా ఉగ్రవాదానికి ఖతర్‌ భారీ స్థాయిలో సాయపడుతోందని,  గత నెల్లో సౌదీలో నిర్వహించిన సదస్సులో ఆ దేశ విధానాల్ని నిరసిస్తూ అరబ్‌ నేతలు తనతో చర్చించారని ట్రంప్‌ పేర్కొన్నారు. 


ఇతర దేశాలు కూడా ఉగ్రవాదం, విద్వేష ప్రచారానికి ముగింపు పలకాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఖతర్‌తో విభేదాల్ని అరబ్‌ దేశాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని టిల్లర్‌సన్‌ పిలుపునిచ్చిన కొద్దిసేపటికే ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ట్రంప్‌ హెచ్చరికను సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్‌లు స్వాగతించాయి. ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమీతో సంభాషణలపై సాక్ష్యమిచ్చేందుకు 100 శాతం సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు ట్రంప్‌ సమాధానమిచ్చారు. విచారణ ఆపమని, విధేయంగా ఉండమని కోమీని ఎప్పుడూ కోరలేదని ఎఫ్‌బీఐ స్పెషల్‌ కౌన్సిల్‌ను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు.  



చర్చలతోనే పరిష్కారం: భారత్‌

న్యూఢిల్లీ: ఖతర్‌ సంక్షోభాన్ని నిర్మాణాత్మక చర్చలు, అంతర్జాతీయ నిబంధనల ప్రకారం పరిష్కరించుకోవాలని గల్ఫ్‌ దేశాలకు భారత్‌ సూచించింది. ఆ ప్రాంతంలోని పరిస్థితులను క్షణ్ణంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గల్ఫ్‌ దేశాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయుల సంక్షేమం, భద్రతకు సాయం కొనసాగిస్తామని అవి హామీ ఇచ్చినట్లు తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top