మోదీ.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్ : ‘ఇమ్రాన్.. పఠాన్ల కుమారుడిననీ, అబద్ధాలు చెప్పనన్నావ్’ ఆ మాటను నిలబెట్టుకుంటావా? అని భారత ప్రధాని విసిరిన సవాల్పై పాక్ ప్రధాని స్పందించారు. తన మాటకు కట్టుబడి ఉన్నానని, ఘటనకు సంబంధించిన ఆధారాలు ఉంటే ఇవ్వాలని, వెంటనే చర్యలు తీసుకుంటామని, ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేసినట్లు పాక్ ప్రధాని కార్యాలయం పేర్కొంది. భారత ప్రధాని నరేంద్రమోదీ శాంతి కోసం ఓ అవకాశం ఇవ్వాలని ఇమ్రాన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 14న జరిగిన ఆత్మహుతి దాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘటనానంతరం ఇరు దేశాల మధ్య ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగ్రవాద దాడుల బాధను భరిస్తూ కూర్చునే ప్రభుత్వం తమది కాదనీ, తప్పక ప్రతీకారం ఉంటుందని మోదీ హెచ్చరించగా.. దాడులను తిప్పికొడతామని పాక్ బదులిచ్చింది.
గత శనివారం మోదీ మాట్లాడుతూ.. ‘ఇమ్రాన్ ఖాన్ పాక్ కొత్త ప్రధానిగా ఎన్నికైనప్పుడు మర్యాదపూర్వకంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పా. ఇన్నాళ్లూ పోట్లాడుకున్నామనీ, ఇకపై చేతులు కలిపి పేదరికం, నిరక్షరాస్యతలను రూపుమాపేందుకు కృషి చేద్దామని కోరా. అందుకు ఆయన ఒప్పుకుంటూ తాను పఠాన్ల కుమారుడిననీ, అబద్ధాలు చెప్పనని అన్నారు. మరి ఆ మాటను ఇప్పుడు ఆయన నిలబెట్టుకుంటారో లేదో చూడాలి’ అని సవాల్ విసిరారు.