కోవిడ్-19: డైమండ్ ప్రిన్సెస్ నుంచి వారికి విముక్తి
వాషింగ్టన్: కోవిడ్-19 ( కరోనా వైరస్) కలకలం నేపథ్యంలో జపాన్లోని యెకోహోమా తీరంలో నిలిపేసిన ‘డైమండ్ ప్రిన్సెస్’ నౌకలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఆదివారానికి 355కి చేరింది. భారత్ సహా 50 దేశాలకు చెందిన 3700 మంది నౌకలో ఉండగా..అమెరికాకు చెందిన వారు 300 మంది వరకు ఉన్నారు. అమెరికన్లలో 14 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వైరస్ బారిన పడిన తమ పౌరులను ప్రత్యేక విమానం తరలించేందుకు అమెరికా చర్యలు చేపట్టింది.
వైరస్ సోకిన ప్రయాణికులను, వారి కుటుంబ సభ్యులను స్వదేశానికి తీసుకెళ్లినట్టు అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం సోమవారం తెలిపింది. కోవిడ్-19కు గురైన వారిని, వారి కుటుంబ సభ్యులను విమానంలో విడివిడిగా తీసుకెళ్లామని వెల్లడించింది. వ్యాధిగ్రస్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారైంటన్లలో చేర్చుతామని ఆరోగ్య, మానవ సేవల విభాగం సోమవారం తెలిపింది. వారికి 14 రోజుల పాటు గట్టి పర్యవేక్షణ నడుమ చికిత్స అందిస్తామని పేర్కొంది. వ్యాధి పూర్తిగా తగ్గిన అనంతరం సొంత స్థలాలకు పంపుతామని వెల్లడించింది. మొత్తం రెండు విమానాల్లో తమ ప్రయాణికులను తరలిస్తామని చెప్పింది.
(కోవిడ్-19: టాయిలెట్ పేపర్ దొంగతనం)