ఆ సైనికుడి శరీర భాగాల నిండా పురుగులు
సియోల్ : ఉత్తరకొరియా నుంచి దక్షిణకొరియాలోకి వెళ్తున్న నార్త్ కొరియన్ సైనికుడిపై ఉత్తరకొరియా సైనికులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. దక్షిణ కొరియా దళాలు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాయి. అతడి శరీరంలోని గాయాలను పరిశీలించిన వైద్యులు షాక్కు గురయ్యారు.
సైనికుడి శరీరంలోని ప్రతి అవయవ భాగంలోనూ వేల సంఖ్యలో పురుగులు ఉన్నట్లు చెప్పారు. తన 20 సంవత్సరాల కెరీర్లో ఇంతటి దారుణమైన కేసును డీల్ చేయలేదని సైనికుడికి శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ పేర్కొన్నారు. ఉదర భాగంలోని అవయవాల నుంచి 27 సెంటీమీటర్ల పొడవున్న పురుగును తీసినట్లు చెప్పారు. వ్యక్తి చిన్నపేగులో అయితే రౌండ్గా ఉన్న పురుగులు ఉన్నాయని తెలిపారు.
ప్రస్తుతం సైనికుడి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. మానవ మలంను ఎరువుగా వాడి పెంచిన కాయగూరలను తినడం వల్లే అతని శరీరంలో పురుగులు తయారయ్యాయని తెలిపారు. వీటిలో కొన్ని ప్రాణాంతకమైనవని, మరికొన్నిటి వల్ల ఎలాంటి ముప్పు ఉండదని డాక్టర్ చెప్పారు.