ముగిసిన ట్రంప్, కిమ్ భేటీ
ఎలాంటి ఒప్పందాలు జరగకుండానే ముగిసిన భేటీ
హనోయ్ : ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ మధ్య భేటీ ఎలాంటి ఫలి తం లేకుండానే ముగిసింది. వియత్నాంలోని హనోయ్లో గురువారం జరిగిన వీరి భేటీలో ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. అమెరికా, ఉత్తర కొరియా న్యూ క్లియర్ సమిట్లో భాగంగా వీరు బుధ, గురువారాల్లో సమావేశమయ్యారు. ఇరుదేశాధినేతల మధ్య జరిగిన చర్చలు సత్ఫలితాలు ఇస్తాయని భావించినప్పటికీ.. ఎలాంటి ఒప్పందాలు జరగకుండానే సమావేశం అర్ధంతరంగా ముగిసింది. భేటీ అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. తమపై విధించిన ఆంక్షలన్నీ ఎత్తివేయాలని ఉత్తర కొరియా కోరిందని దానికి తాము అంగీకరించలేదని వెల్లడించారు. దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే చర్చలు ముగిశాయని చెప్పారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, తమ మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఓ పనిని త్వరగా పూర్తి చేయడం కంటే సరిగా చేయడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. అణ్వాయుధాలు, క్షిపణులు ప్రయోగించబోనని కిమ్ ఇచ్చిన మాట కు కట్టుబడి ఉంటారని తాను భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. త్వరలో కిమ్ ను మరోసారి కలుస్తానని భావిస్తున్నట్లు తెలిపారు. వైట్హౌస్ నిర్దేశించిన కార్యక్రమం ప్రకారం ట్రంప్, కిమ్లు కలిసి భోజనం చేసిన అనంతరం ఇరు దేశాల మధ్య ఒప్పందానికి సంబంధించి సంతకాలు చేయాల్సి ఉంది. అయితే దీనికి భిన్నంగా వారు 2 గంటల్లోనే భేటీని ముగించారు. ట్రంప్, కిమ్ల భేటీపై పలువురు మండిపడుతున్నారు. ట్రంప్ ధోరణితో ఆగ్రహానికి గురైన కిమ్ భేటీ మ ధ్యలోనే వెళ్లిపోయారని, ఇక మరోసారి ట్రంప్తో భేటీ కారని కొందరు ఎద్దేవా చేశారు. మరికొందరు ప్రమాదం కలిగించే ఒప్పందాలు కుదుర్చుకోవడం కన్నా ఎలాంటి ఒప్పందం కుదరకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు.
భారత్, పాక్ ఉద్రిక్తతలు సమసిపోతాయి: ట్రంప్
హనోయ్ : భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధ శక్తి గల ఇద్దరు దాయాదుల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు త్వరలోనే సమసిపోయే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తమ వద్ద సహేతుకమైన మంచి వార్త ఉందని అన్నారు. వియత్నాంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్తో రెండోసారి భేటీ అయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వారిద్దరి మధ్య ఉన్న ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించేందుకు మేము కృషి చేస్తున్నాం. భారత్, పాక్ల మధ్య గొడవలు సమసిపోతాయన్న విశ్వాసం మాకు ఉంది. దీనికి సంబంధించి మా దగ్గర మంచి కబురు ఉంది’అని ఆయన చెప్పారు. పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ వైమానిక దాడులు నిర్వహించడం.. అందుకు ప్రతిగా పాక్ భారత్ గగనతలంలోకి యుద్ధ విమానాలతో చొరబడటం.. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్, పాక్ల మధ్య ఉన్న ప్రస్తుత పరిస్థితులపై ఆయన తొలిసారి మాట్లాడారు. అంతకుముందు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ఫోన్లో మాట్లాడారు. పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్పై భారత సర్జికల్ దాడులు అంశాలపై ఇరువురు చర్చించారు. అలాగే అమెరికా రక్షణ మంత్రి పాట్రిక్ షానహాన్ సైతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేస్తున్నారని, ఇరు దేశాలు తదుపరి ఎలాంటి సైనిక చర్యలకు దిగకుండా చర్చిస్తున్నారని పెంటగాన్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. అలాగే ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడం, ఆ దేశంలో ఉగ్రవాదుల ఉనికి లేకుండా చేయడం వంటి వాగ్దానాలకు కట్టుబడి ఉండాలని పాకిస్తాన్ను అమెరికా కోరినట్లు తెలిపింది.