మరో రెండు వారాల్లో తారాస్థాయికి కరోనా మరణాలు
న్యూయార్క్ : మరో రెండు వారాల్లో కరోనా వైరస్ మరణాల సంఖ్య అమెరికాలో తారస్థాయికి చేరుకుంటుందని దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన ప్రజలనుద్ధేశించి మాట్లాడుతూ.. జూన్ 1నుంచి కరోనా ప్రభావం తగ్గి దేశం కోలుకుని కుదుటపడుతుందన్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా సామాజిక దూరానికి సంబంధించిన నిబంధనలను ఏప్రిల్ 30వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, అమెరికాలో ఇప్పటివరకు 1,40,734 కేసులు నమోదు కాగా, దాదాపు 2500 మంది మృత్యువాత పడ్డారు. ఆదివారం ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదు కాగా, 255 మంది మరణించారు. దీంతో సామాజిక దూరం పాటించని వారిపై పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. 200-400 డాలర్లు వసూలు చేస్తున్నారు.
న్యూయార్క్, కాలిఫోర్నియాలలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో న్యూయార్క్ నగరవాసులెవరూ ఇల్లు కదిలి బయటకు వెళ్లొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం వైరస్ ప్రభావం డెట్రాయిట్, న్యూ ఓర్లీన్స్, చికాగోల్లో మొదలైంది.