'మూడు వ్యూహాలతో భారత్‌పైకి చైనా'

'మూడు వ్యూహాలతో భారత్‌పైకి చైనా'


న్యూఢిల్లీ : ఒక్క బుల్లెట్‌ కూడా వాడకుండా భారత్‌పై చైనా గెలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రం విషయంలో పిలిప్పీన్స్‌పై ఉపయోగించిన మూడు వ్యూహాలనే తిరిగి భారత్‌పై ప్రయోగించాలని అనుకుంటున్నట్లు సమాచారం. భారత్‌ చైనాల మధ్య గత 50 రోజులకు పైగా డోక్లామ్‌ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ పరిశీలిస్తున్న భారత వ్యూహకర్తలు చైనా లక్ష్యాన్ని పసిగట్టారు. చివరకు చైనా తన మూడు వ్యూహాలను భారత్‌పై ప్రయోగించడం మొదలుపెట్టిందని, అందులో భాగంగానే ప్రస్తుత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది.



ఏమిటి ఆ మూడు వ్యూహాలు?



మీడియా యుద్ధం

ప్రజలు అభిప్రాయపడుతున్నట్లుగా తొలుత మీడియాతో దాడి చేయించడం. ఇందులో భాగంగా అక్కడి కొందరు నేతలతో దురుసుగా మాట్లాడించడం, ప్రజలు కూడా దానికి మద్దతిస్తున్నట్లుగా కథనాల్లో పేర్కొనడం. ఇలా చేయడం ద్వారా ప్రత్యర్థిని ఒక ఆలోచనలో పడేస్తారు.



మానసిక యుద్ధం

చైనా మీడియా ప్రచురించిన వార్తలను ఉన్నది ఉన్నట్లుగా తిరిగి ప్రత్యర్థి దేశంలోని మీడియా వారి దేశంలో వెల్లడిస్తుంది. దీని ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఘర్షణ ఎందుకులే అనే భావనలోకి ప్రత్యర్థి దేశం రావడం, స్వశక్తిపై నమ్మకం కోల్పోయి రాజీపడటంలాంటివి జరుగుతుంది. ఈ క్రమంలో తొలుత రెచ్చగొట్టే వ్యాఖ్యలు అనూహ్యంగా ప్రత్యర్థి నుంచి కూడా వస్తాయి. వీటిని మరింత క్యాచ్‌ చేసుకొని అంతర్జాతీయ సమాజానికి చూపించాలని చైనా భావిస్తుంటుంది.



చట్టపరమైన యుద్ధం

అంతర్జాతీయ న్యాయస్థానం వద్ద ప్రభావవంతంగా పనిచేయడమే ఈ వ్యూహ ప్రధాన ఉద్దేశం. అంతకుముందు తాను రెచ్చగొట్టడం ద్వారా ప్రత్యర్థి చేసిన పొరపాట్లన్ని కూర్చి అంతర్జాతీయ న్యాయస్థానం ముందు పెడుతుంది. అప్పటికే అంతర్జాతీయ న్యాయస్థానం తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే దాన్ని కూడా దిక్కరిస్తుంది. ఎప్పుడు న్యాయ నిబంధనలు గౌరవిస్తుందో.. అవమానపరుస్తుందో ఆ దేశానికి తెలియని తీరుగా వ్యవరిస్తుంటుంది. ప్రస్తుతం పై మూడు వ్యూహాలనే భారత్‌పై ప్రయోగిస్తున్నట్లు భారత వ్యూహాల నిపుణులు అంటున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top