భారత్ ఇంత చేస్తున్నా చైనా స్పందించదేం..!
బీజింగ్: కరోనా వైరస్ (కోవిడ్-19) విలయం చైనాలో కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా చైనాకు సాయమందించడానికి భారత్ సానుకూలంగా ఉన్నప్పటికీ ఆ దేశం నుంచి ఎలాంటి స్పందన ఉండటం లేదు. వైద్య సాయం నిమిత్తం ఈ నెల 20వ తేదీన వూహాన్ నగరానికి వెళ్లాల్సిన ఇండియా విమానానికి ఇప్పటిదాకా అనుమతులు రావడం లేదు. చైనా నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో విమానం ఢిల్లీ విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. కావాలనే చైనా మన విమానానికి అనుమతి ఇవ్వడంలేదని అధికారులు వెల్లడించారు. చదవండి: తగ్గుతున్న కోవిడ్ కేసులు
కరోనా దెబ్బతో బిక్కుబిక్కుమంటున్న చైనాకు భారత్ సహకరించాలని ముందుకు వచ్చింది. అందులో భాగంగానే చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్కు ప్రధాని మోదీ సంఘీభావంగా ఓ లేఖ కూడా రాశారు. వీలైనంత సాయం చేస్తామని పేర్కొన్నారు. సర్జికల్ మాస్కులు, గ్లౌజులు, ఫీడింగ్ పంపులు తదితర అత్యవసర వస్తువులను పంపేందుకు సిద్ధంగా ఉంది. భారత్ ఇంత చేస్తున్నా చైనా మాత్రం విమానానికి సంబంధించిన క్లియరెన్స్ ఇవ్వడం లేదు. మిగిలిన దేశాలకు చెందిన విమాన రాకపోకలను మాత్రం అనుమతిస్తుండటం గమనార్హం. మరోవైపు హుబేయ్ ప్రావిన్సులో నిన్న ఒక్క రోజే 109 మంది చనిపోయారు. ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకూ ఈ మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 76,288కు చేరుకోగా మొత్తం 2,345 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: కోవిడ్-19 : కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు!
మరిన్ని వార్తలు