జాతీయ కమిషన్తో కలసి పనిచేస్తాం
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను, ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించేందుకు ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యుడు రాములును కలిశామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. 2009 తర్వాత ఈ కమిషన్ లేదని, 2018లోనే కమిషన్ ఏర్పాటైందని చెప్పారు.
దళితుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, దళితులకు న్యాయం చేసేలా ఈ కమిషన్ పనిచేస్తుందన్నారు. దీనికోసం అవసరమైతే జాతీయ కమిషన్తో కూడా కలసి పనిచేస్తామని చెప్పారు. హైదరాబాద్ దిల్కుషా అతిథి గృహంలో సోమవారం తనను కలసిన రాష్ట్ర కమిషన్ చైర్మన్, సభ్యులను జాతీయ కమిషన్ సభ్యుడు రాములు అభినందించారు. దళితుల మీద జరిగే దాడులపై చర్యలు తీసుకునే అధికారాలు కమిషన్కున్నాయని, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిన బాధ్యత కమిషన్పై ఉందని రాములు అభిప్రాయపడ్డారు.