ఒంటరి పోరు ఎలా ఉంటుంది?
పార్టీ శ్రేణులను ఆరా తీస్తున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్లోని నివాసంలోనే కొందరు ముఖ్యనేతలతో కేసీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విలీనంపై చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని పార్టీ ముఖ్యులకు వెల్లడించారు.
తెలంగాణ ఏర్పాటైన నేపథ్యంలో వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయని పార్టీ శ్రేణులను, జిల్లాల్లోని పార్టీ ముఖ్యులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్కు బలం ఎలా ఉంది? ఒకవేళ బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? టీఆర్ఎస్పై ప్రజల్లో ఎలాంటి భావన ఉంది? అని పార్టీ శ్రేణులనుంచి సమాచారం సేకరిస్తున్నారు. విలీనం మంచిదా? ఒంటరిపోరు మంచిదా? అని కూడా ఆరా తీస్తున్నారు. తెలంగాణ సాధించిన ఘనత టీఆర్ఎస్దేనని, ప్రజలు కూడా ఇదే భావనలో ఉన్నారని జిల్లాల నుండి పార్టీ ముఖ్యుల అభిప్రాయాన్ని కేసీఆర్కు చెప్పినట్టుగా తెలిసింది. టీఆర్ఎస్కు పొత్తులే అవసరం లేదని, విలీనం చేయకున్నా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని జిల్లాల నుండి అభిప్రాయాలు వస్తున్నట్టుగా తెలిసింది.